ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు కట్టు దిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ, రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి పర్యటనకు చేస్తున్న ఏర్పాట్లపై గురువారం రామగుండంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, డి.సి.పి. రూపేష్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ, నవంబర్ 12న జిల్లాలో ప్రధాన మంత్రి పర్యటన సందర్భంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కార్యక్రమం విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నవంబర్ 12న మధ్యాహ్నం ప్రధానమంత్రి రామగుండం ప్రాంతానికి వస్తారని, ఆర్.ఎఫ్.సి.ఎల్ ప్లాంట్ ను సందర్శించి జాతికి అంకితం చేస్తారని, అనంతరం ఎన్టిపిసి స్టేడియంలో నిర్వహించే సభలో ప్రధానమంత్రి పాల్గొని ప్రసంగిస్తారని కలెక్టర్ తెలిపారు.రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు కట్టు దిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నామని, ఇతర జిల్లాల నుంచి 5 ఎస్పీలు,5 అదనపు ఎస్పీలు, 25 డీఎస్పీ లు, 2000 మంది పోలీసులు పాల్గొంటారని, మొత్తం 2500 పోలీసు సిబ్బందితో ప్రధానికి కట్టుదిట్టమైన భద్రత వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రధానమంత్రి భద్రత సిబ్బంది సూచనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.
Admin
Aakanksha News