ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం సెంటర్ ను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, 18 సంవత్సరాలు నిండిన వారందరూ,అక్టోబర్ 1 2023 నాటికి 18 సంవత్సరాలు నిండబోయే పౌరులకు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే విధంగా కృషి చేయాలని, జిల్లాలోని జూనియర్, డిగ్రీ కళాశాలలో, వివిధ వృత్తి నైపుణ్య విద్యార్థులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా ప్రధానోపాధ్యాయుల సహకారంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.రాబోయే ఎన్నికలో ఓటరు జాబితా పకడ్బందీగా ఉండేలా చూడాలని, డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను ఆగస్టు 21న విడుదల చేశామని, ఆగస్టు 26 ,ఆగస్టు 27, సెప్టెంబర్ 2 సెప్టెంబర్ 3 తేదీలలో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం శిబిరాన్ని ఏర్పాటు చేసి నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితాలో అభ్యంతరాల స్వీకరణ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఓటరు జాబితాలో మరణించిన వ్యక్తుల వివరాలు ఉంటే వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.ఓటరు జాబితాలో అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 19 లోపు తెలియజేయాలని, అక్టోబర్ 1 2023 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి ఒక్కరూ కోసం దరఖాస్తు చేసుకోవాలని, పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేదిన ప్రత్యేక ఓటర్ నమోదు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.అనంతరం జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులతో జిల్లా కలెక్టర్ ముచ్చటించారు. జూనియర్ కళాశాలలో వారికి అందుతున్న విద్యా వసతులు, తదితర అంశాలను అడిగి తెలుసు కున్నారు. నిర్దేశిత భవిష్యత్ లక్ష్యసాధన దిశగా విద్యార్థులు పట్టదలతో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి మధుసూదన్, తహసిల్దార్ రాజ్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నవీన్ రావు, కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది, బూత్ స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News