ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాల్సిందే అని రామగుండం నియోజకవర్గ ఆశవాహులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం బసంత్ నగర్ కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ... నియోజకవర్గ ప్రజల్లో స్థానిక ఎమ్మెల్యే పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని వారన్నారు. తాము పార్టీకి వ్యతిరేకం కాదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను 3వ సారీ ముఖ్యమంత్రి చేయడానికి అన్ని విధాలుగా కృషి చేస్తామని వారు తెలిపారు. రామగుండం నియోజకవర్గ టికెట్ ఎమ్మెల్యే కు కేటాయించవద్దని వారు పేర్కొన్నారు. రామగుండం నియోజకవర్గం అవినీతిమయంగా మారిపోయిందని, స్థానిక నాయకులను, కార్యకర్తలను పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే పై ఉన్న వ్యతిరేకత రానున్న ఎన్నికల్లో పార్టీపై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని వెంటనే అధిష్టానం స్పందించి అభ్యర్థిని మార్చాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కన్నాల సింగిల్ విండో చైర్మన్ బయ్యపు మనోహర్ రెడ్డి, పాలకుర్తి జడ్పిటిసి కందుల సంధ్యారాణి, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, నగరపాలక సంస్థ తొలి మాజీ మేయర్ కొంక్కటి లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాతిపెల్లి ఎల్లయ్యలతో పాటు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News