ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / ఖమ్మం జిల్లా : విద్యార్థులు గంజాయి, డ్రగ్స్కు అలవాటు పడకుండా పోలీస్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఖమ్మం నగరంలో మామిళ్ళగూడెం, సారథి నగర్ కాలనీలను అనుసంధానం చేసే రైల్వే అండర్ మినీ బ్రిడ్జిని ఇవాళ(శనివారం) మంత్రి తుమ్మల ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ....ఖమ్మం నగరంలో ట్రాఫిక్ కష్టాలు లేకుండా రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా ఉన్నపుడు అండర్ బ్రిడ్జిని తాను శాంక్షన్ చేశానని.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నపుడు శంకుస్థాపన చేశానని గుర్తుచేశారు. ప్రజా పాలన ఏడాదిలో అర్.యుబీ ప్రారంభోత్సవం చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.ఖమ్మం నగరంలో విశాలమైన రహదారులు, పార్క్లు ఏర్పాటు చేశామని చెప్పారు. 500 ఎకరాలు ఉన్న వెలుగుమట్ల పార్క్ను ఖమ్మం నగరానికి పర్యాటక ప్రదేశంగా ల్యాండ్ మార్క్గా అభివృద్ధి చేశానని తెలిపారు. ఖమ్మం చరిత్ర తెలిపేలా ఖిల్లాపై రోప్వే ఏర్పాటుతో పర్యాటక అభివృద్ధి చెందుతుందని అన్నారు. పెరుగుతున్న అర్బన్ పాపులేషన్కు తగ్గట్టుగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. ఖమ్మం నగరం పరిశుభ్రంగా విశాలమైన రహదారులు పచ్చదనంతో ఇతర నగరాలకు ఆదర్శంగా ఉండాలని అన్నారు. నాలాలు పూడ్చి అక్రమ కట్టడాలు నిర్మించడం వల్లే మున్నేరుకు వరద ముంపు గండం వచ్చిందని చెప్పారు. అడవులను కొట్టడం వల్లే కోతులు జనావాసాల్లోకి వస్తున్నాయని తెలిపారు. ఖమ్మం విప్లవాల పురిటిగడ్డ అన్నారు. స్వాతంత్ర సంగ్రామంలో నైజాం రజాకార్లను తరిమి కొట్టిన జిల్లా ఖమ్మం జిల్లా అని ఉద్ఘాటించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో తనకు మంత్రిగా అవకాశం ఇచ్చిన ఖమ్మం ప్రజలకు తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు.
Admin
Aakanksha News