ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / సూర్యాపేట జిల్లా : వర్కింగ్ జర్నలిస్టులను పోలీసులు ఇబ్బందులు పెట్టకుండా చూడాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ను కోరారు.ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులతో కలిసి సోమవారం వినతిపత్రం అందించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి వేతనాలు లేకుండా నిస్వార్థంతో నీతి నిజాయితీతో ప్రజలకు ప్రభుత్వానికి ఉచితంగా సేవ చేస్తున్న జర్నలిస్టులను పోలీసులు ఇబ్బందులు పెట్టకుండా వార్తల కవరేజిలో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులకు సహకరించాలని కోరారు.అక్కడక్కడా పోలీసులు జర్నలిస్టులను అనవసరంగా దుర్భాషలాడటం సరియైన పదజాలం వాడకపోవడం నోటికి వచ్చినట్లు ఇష్టానుసారంగా మాట్లాడడం సరైంది కాదని ఫ్రెండ్లీ పోలీస్ ఫ్రెండ్లీ జర్నలిస్టు అనే విధంగా వ్యవహరించాలని తెలిపారు. సూర్యాపేట జిల్లాలో జర్నలిస్టులకు పోలీసుల నుండి వస్తున్న చేదు అనుభవాలను ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. అంతే కాకుండా వర్క్ లో ఉన్న ప్రతి జర్నలిస్టుకు రాష్ట్ర డీజీపీ సంతకంతో కూడిన పోలీస్ భరోసా కార్డులు ఇచ్చేందుకు తమ వంతుగా సహకరించాలని కోరారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాల్లో పని చేస్తున్న దాదాపు ఇరవై వేల మంది జర్నలిస్టుల పక్షంగా తాము ఈ విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. అదే విధంగా జర్నలిస్టులు ఇష్టానుసారంగా వ్యవహరించకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు. కొంతమంది జర్నలిస్టులు అక్రమాలకు పాల్పడుతూ జర్నలిస్ట్ వృత్తిని మలినం చేస్తున్నారని అటువంటి వారు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. కొందరు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాల యాజమాన్యాలు ధనార్జనే ప్రధానంగా ఈ రంగంలోకి వచ్చి తమ వద్ద పని చేస్తున్న జర్నలిస్టులకు టార్గెట్లు పెట్టి జర్నలిస్టులకు నానా రకాల సమస్యలు పెడుతున్నారని అటువంటిది పునరావృతం కాకుండా చూసుకోవాలని తెలిపారు. జర్నలిజం వృత్తికి కళంకం తీసుకొచ్చే వారిని జర్నలిస్టులుగా తీసుకోవద్దని హితవు పలికారు. ఈ వినతిపత్రం ఇచ్చినవారిలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ధూపాటి శ్యాంబాబు,రాష్ట్ర ప్రచార సహాయ కార్యదర్శి దుర్గం బాలు,సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షుడు రాచకొండ రామచంద్ర రాజు, మోతె మండల అధ్యక్షుడు మాలోతు కోటినాయక్, సీనియర్ జర్నలిస్టులు శ్రీనివాసరెడ్డి,పల్లెల రాము తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News