Thursday, 19 February 2026 03:34:12 AM

న్యాయవాదుల నిరసనలకు డివైఎఫ్ఐ సంపూర్ణ మద్దతు...

Date : 18 February 2026 02:49 PM Views : 96

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో న్యాయవాదులపై జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసన కార్యక్రమాలకు భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డివైఎఫ్ఐ) పెద్దపల్లి జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శి కొంటు సాగర్ విడుదల చేసిన ప్రకటనలో వివరించారు.గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి న్యాయవాదుల పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ, గత ఆరు రోజులుగా బార్ అసోసియేషన్ చేపట్టిన ఆందోళనలకు యువజన సంఘం పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. ఈనెల 10వ తేదీన యువ న్యాయవాది మార్కపురి తిలక్ తన వృత్తి సంబంధిత పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో సీఐతో పాటు అతని గన్ మెన్ అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా, న్యాయవాదిపై చేయి చేసుకోవడానికి ప్రయత్నించడం తీవ్రంగా ఖండనీయమని పేర్కొన్నారు. పోలీసు శాఖకు ఫిర్యాదులు వచ్చినపుడు చట్టపరమైన విధానాల ప్రకారం సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సి ఉండగా, దురుసుగా ప్రవర్తించడం వల్ల ప్రజల్లో పోలీసులపై నమ్మకం దెబ్బతింటుందని కొంటు సాగర్ అన్నారు.సమాజంలో యువత ఉద్యోగాల వైపు అడుగులు వేస్తున్న తరుణంలో, ప్రజలకు న్యాయ సేవలు అందించేందుకు కట్టుబడి పనిచేస్తున్న న్యాయవాదుల పట్ల ఇలాంటి ప్రవర్తన అసంబద్ధమని అన్నారు.గతంలోనూ ఇదే అధికారిపై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సంబంధిత అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో న్యాయవాదులు చేపట్టే ప్రత్యక్ష పోరాటాలకు యువజన సంఘం కూడా చురుకుగా మద్దతు తెలుపుతూ నిరసన కార్యక్రమాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :