ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : మాయ మాటలతో రైతులను మోసం చేసి 420 హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి మండల పరిషత్ కార్యాలయం ఎదుట గులాబీ పార్టీ శ్రేణులతో కలసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టి బైఠాయించారు. ఈ సందర్భంగా కౌశిక హరి మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసేందుకు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ వివిధ రకాల కారణాలతో ప్రభుత్వం కొర్రీలను విధిస్తుందన్నారు. ఇప్పటికే రైతులకు రుణమాఫీ చేయకపోగా రైతుబంధు కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై వినతి పత్రాలను అందించేందుకు తహసిల్దార్ కార్యాలయానికి వస్తే పోలీసులు నిర్బంధాలకు గురి చేస్తున్నారన్నారు. ఎక్కడో ఎమ్మెల్యే రాహుల్ గాంధీని విమర్శించారని అధికార పార్టీకి చెందిన నాయకులు గంటల తరబడి రోడ్లపై రాస్తారోకోలు ధర్నాలు చేస్తే లేని నిర్బంధాలు రైతు సమస్యలపై కొట్లాడే మాపై నిర్బంధాలు ఎందుకు అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రైతులందరికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు
Admin
Aakanksha News