ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : ఆపరేషన్ కగార్ ను తక్షణమే నిలిపివేయాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు ప్రారంభించాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు కోరారు.పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన ముఖ్యమైన సమావేశంలో టీపీఎఫ్ నాయకులు ఈ మేరకు తమ అభిప్రాయాలను స్పష్టం చేశారు.జిల్లా కన్వీనర్ గుమ్మడి కొమురయ్య అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి టీపీఎఫ్ రాష్ట్ర కో-కన్వీనర్ బి. రమాదేవి,పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాధన కుమారస్వామి,మంథని సంజీవరావు వంటి ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ సింగరేణి ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ గనుల వల్ల జరుగుతున్న పర్యావరణ నష్టం,ఇటుక బట్టీలలో ఒరిస్సాకు చెందిన కార్మికుల దోపిడీ, దళితులు,మైనారిటీ వర్గాలపై జరుగుతున్న దాడుల వంటి అనేక సమస్యలపై జిల్లా కమిటీ గతంలో చేసిన పోరాటాలను గుర్తు చేశారు.కామ్రేడ్ బెల్లి లలిత, మద్దిలేటి,నల్ల వసంత్,ఆకుల భూమన్న,గద్దర్ వంటి అమరుల త్యాగాలు ప్రజా ఉద్యమాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఆమె ఉద్ఘాటించారు.కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని,మావోయిస్టులతో శాంతియుత చర్చలు ప్రారంభించాలని ఆమె సూటిగా డిమాండ్ చేశారు.అంతేకాకుండా,ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు ప్రధాన హామీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని,కాల్వ శ్రీరాంపూర్ మండలం కునారంలో నిరుపేదలకు చెందిన ఆక్రమిత భూములను వారికి తిరిగి పంపిణీ చేయాలని ఆమె కోరారు.ఈ సమావేశంలో టీపీఎఫ్ పెద్దపల్లి జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గుమ్మడి కొమురయ్య తిరిగి అధ్యక్షుడిగా ఎన్నిక కాగా,ఉపాధ్యక్షుడిగా గాండ్ల మల్లేశం,ప్రధాన కార్యదర్శిగా పులిపాక రవీందర్,కమిటీ సభ్యులుగా రాజు,అంజన్న,సుధాకర్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ముడిమడుగుల మల్లన్న,బొంకూరి లక్ష్మణ్,బొడ్డుపల్లి రవి,విరసం కరీంనగర్ జిల్లా కన్వీనర్ బాలసాని రాజయ్య,దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడి సుదర్శన్,ఎరుకల రాజన్న, జైపాల్ సింగ్,పీక కిరణ్,పుల్ల సుచరిత,శ్రీపతి రాజగోపాల్,గూళ్ల రాజు,బత్తారి ఆంజనేయులు, పొన్నం రాజమల్లయ్య,సుధాకర్,సరేందర్,రామిళ్ల బాపు,గట్టన్న,జగన్,బండి శంకర్ తో పాటు పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News