ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : ఏఐటీయూసీ గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కార్మికుల ఖాతాల్లో నుంచి చందాలు, మెంబర్షిప్ పేరుతో డబ్బులు కట్ చేస్తూ ఉంటే సింగరేణి యాజమాన్యం ఏం చేస్తుందని సీఐటీయూ నాయకులు తుమ్మల రాజిరెడ్డి, మొండే శ్రీనివాస్ లు ప్రశ్నించారు. ఈ మేరకు 2వ ఇంక్లైన్ లో కార్మికులను కలుసుకొని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా సింగరేణిలో పనిచేస్తున్న మహిళా కార్మికులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కార్మికుల ఫోర్జరీ సంతకాలతో గుర్తింపు కార్మిక సంఘం డబ్బులను కట్ చేస్తూ ఉంటే యాజమాన్యం మొద్దు నిద్ర పోతుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే కాకుండా ప్రతినెల కార్మికుల ఖాతాలో నుండి 50 రూపాయలు తీసుకుంటున్నారని ఇప్పటికే గుర్తింపు కార్మిక సంఘం తప్పు చేస్తుందని చెప్పినా కూడా యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు. మందమర్రి, భూపాలపల్లి ఏరియాలలో కొంతమంది కార్మికుల ఖాతాల్లో నుండి ఒకేసారి రెండు నెలల చొప్పున 100 రూపాయలు ఎలా కట్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. దీనిపై యాజమాన్యం తక్షణమే స్పందించకపోతే సిఐటియు యూనియన్ తరపున కోర్టులో కేసు వేయడానికి కూడా సిద్ధమని వారు హెచ్చరించారు. ఇప్పటికైనా కార్మికుల ఫోర్జరీ సంతకాలపై యాజమాన్యం విచారణ చేపట్టి వెంటనే కార్మికులు పెట్టిన సంతకాలను నోటీసు బోర్డులో పెట్టి నకిలీ సంతకాల లేక కార్మికులు పెట్టిన సంతకాలైన అనేది తేల్చాల్సి ఉందని వారు డిమాండ్ చేశారు.
Admin
Aakanksha News