ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : విద్యార్థుల ప్రతిభాభివృద్ధికి అంకితంగా పనిచేస్తున్న నారాయణ విద్యాసంస్థలు మరోసారి తమ ప్రతిష్టను చాటుకున్నాయి. గోదావరిఖని మార్కండేయ కాలనీలోని నారాయణ పాఠశాలలో “మాస్టర్ ఓరెంటర్ కాంటెస్ట్” కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జోన్ పరిధిలోని గోదావరిఖని, మంచిర్యాల, కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల బ్రాంచీలకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భారీ సంఖ్యలో పాల్గొని ఉత్సాహాన్ని నింపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నారాయణ పాఠశాలల ఏజీఎం చైతన్య రావు, చామ్స్ ఆర్ అండ్ డి హెడ్ స్వాతి లక్ష్మి, సాఫ్ట్ స్కిల్స్ లీడ్ గీత కుమారి హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభంలో జ్యోతి ప్రజ్వలన చేసి విద్యా ప్రగతికి నాంది పలికారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రసంగాలు, వినోదాత్మక అంశాలతో కార్యక్రమం చక్కగా సాగింది. చిన్నారుల నుంచి సీనియర్ విద్యార్థుల దాకా తమ ప్రతిభను విన్యాసాలతో, నృత్యాలతో, పాఠశాల జీవితాన్ని ప్రతిబింబించే ఆత్మవిశ్వాసంతో కనబరిచారు.ఈ సందర్భంగా ఏజీఎం చైతన్య రావు మాట్లాడుతూ.... విద్య అంటే కేవలం పుస్తకపఠనం మాత్రమే కాదు, మన ఆలోచన, ఆత్మవిశ్వాసం, మాట్లాడే నైపుణ్యం కూడా సమానంగా ముఖ్యం. నారాయణ సంస్థలు విద్యార్థుల భవిష్యత్తు కోసం అన్ని విధాలా కృషి చేస్తున్నాయి” అని తెలిపారు. సాఫ్ట్ స్కిల్స్ లీడ్ గీత కుమారి మాట్లాడుతూ విద్యార్థులు మాట్లాడే తీరు, ఆలోచనా శక్తి, సమాజంలో తమ స్థానాన్ని ఏర్పరుచుకునే దిశగా ఇలాంటి పోటీలు ఎంతో దోహదం చేస్తాయని అభిప్రాయపడ్డారు. చామ్స్ ఆర్ అండ్ డి హెడ్ స్వాతి లక్ష్మి విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయడమే ఈ కాంటెస్ట్ ఉద్దేశమని పేర్కొన్నారు. విద్యార్థుల మధ్య జరిగిన పోటాపోటీ ప్రదర్శనలు తల్లిదండ్రులను ఉత్సాహపరిచాయి. గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రదానం చేశారు. విద్యార్థుల విజయాల వెనుక ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉన్నదని వేదికపై ప్రసంగించిన అతిథులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జోన్ ఏజీఎం చైతన్య రావుతో పాటు ఆర్.ఐ. సత్యం రావు, ఆరు బ్రాంచీల ప్రిన్సిపాళ్లు రజని, భాస్కర్ రెడ్డి, స్రవంతి, రమ్య, క్రాంతి పాల్, శాంతి కిరణ్, వైస్ ప్రిన్సిపాళ్లు, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్లు, బోధన సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.నారాయణ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మాస్టర్ ఓరెంటర్ కాంటెస్ట్ విద్యార్థుల ప్రతిభకు వేదికగా నిలిచింది. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంపొందించే దిశగా ఈ కార్యక్రమం విశేష స్పందన పొందింది.
Admin
Aakanksha News