ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : సోషల్ మీడియా వేదిక X(ట్విట్టర్)లో రెచ్చగొట్టే, పరువు నష్టం కలిగించే పోస్టులు పెట్టిన వ్యక్తిపై రామగుండం సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ జీ. సతీష్ సైబర్ పెట్రోలింగ్లో భాగంగా 16 మార్చి 2025న ట్విట్టర్ను పరిశీలిస్తుండగా, @Nallabalu అనే యూజర్ ఐడీ గల వ్యక్తి “కాంగ్రెస్ రాష్ట్రానికి శాపం! పొలం తెగులు బారిన పడితే, పంట నాశనం అవుతుంది. రాష్ట్రం తెగులు బారిన పడితే, ప్రజలు కలవరపడతారు” అని పోస్ట్ చేసినట్లు గుర్తించారు.ఈ పోస్ట్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టకు భంగం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా చేసినదని, ప్రజల్లో ఆందోళన కలిగించే అవకాశం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నారు. తప్పుడు సమాచారం ద్వారా ప్రభుత్వంపై, రాజకీయ ప్రముఖులపై ప్రజల్లో అసంతృప్తిని రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో కేసు నంబర్ 08/2025 కింద BNS చట్టంలోని సెక్షన్లు 192, 353 (1)(b), 352, 356 R/W 61(2)తో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు రామగుండం సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.
Admin
Aakanksha News