ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతోందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, వీహెచ్ ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. సోషల్ మీడియాలో కేసులు చెల్లవని తెలిసినా కేవలం ప్రజలను భయపెట్టడానికే ఈ చర్యలు చేపడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా బిజెపి కార్యకర్త గతంలో బండి సంజయ్ పై అనుచిత వాక్యాలు చేశారంటూ చేసిన ఫిర్యాదు పై ఈ నెల 16వ తేదీన గోదావరిఖని ఒకటో పట్టణ పోలీసులు నోటీసులు అందజేయగా వాటికి వివరణ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్ కు హరీష్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ నాయకులు అసభ్యంగా మాట్లాడినా కేసులు నమోదు చేయలేదు. కానీ, ఇప్పుడు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తేనే కేసులు పెడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని హరీష్ రెడ్డి మండిపడ్డారు.రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన మేము కూడా ఒక బుక్కు పెట్టుకుంటాం... వారి పేరు నమోదు చేసి వడ్డీతో సహా చెల్లిస్తాం అని హరీష్ రెడ్డి హెచ్చరించారు. పోలీసులు విచారణకు పిలిచినప్పుడు తాను హాజరై సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్న ఆయన, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించినందుకే అక్రమ కేసులు పెడుతున్నారని తీవ్రంగా ఆక్షేపించారు. సోషల్ మీడియా కేసులు చెల్లవని తెలిసిన అక్రమ కేసులు నమోదు చేస్తూ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని విమర్శించారు. ఇప్పటివరకు హైదరాబాద్,గోదావరిఖనిలో 10 కేసులు నమోదయాయని వీటిని చట్టబద్ధంగా న్యాయస్థానాల్లోనే ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
Admin
Aakanksha News