ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు జరిపిన ఘటన కలకలం రేపింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డిఎంహెచ్ఓ) డాక్టర్ అన్న ప్రసన్నకుమారి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి.డిఎంహెచ్ఓ ప్రసన్నకుమారి, గత కొన్నేళ్లుగా సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) కోసం దరఖాస్తు చేసిన బాధితుల రికార్డులను పరిశీలించేందుకు రామగుండం నగరంలోని వివిధ ఆసుపత్రులకు సందర్శించగా, వాటిలో రామగుండం మాజీ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ నిర్వహిస్తున్న ఆసుపత్రిని కూడా ప్రత్యేకంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఒక్కో శాఖను జాగ్రత్తగా పరిశీలించిన ఆమె, ఆ ఆసుపత్రికి అధికారిక సమాచారం లేకుండానే విద్యుత్ సరఫరా నిలిపివేయడాన్ని గమనించి అసహనం వ్యక్తం చేశారు. దీనితో ఆమె తనిఖీని మధ్యలోనే ఆపి వెళ్లిపోయినట్టు తెలిసింది.ఈ ఘటన నేపథ్యంలో ఆ ఆసుపత్రిని మూసివేస్తారన్న ఊహాగానాలతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘పేదోళ్ల ఆసుపత్రిని ముసివేస్తే ఊరుకునేది లేదు’’ అంటూ ప్రజలు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. మహిళలు కూడా భారీ సంఖ్యలో హాజరై ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన డిఎంహెచ్ఓ అన్న ప్రసన్నకుమారి, ‘‘నేను ఆసుపత్రులను తనిఖీ చేయడానికి రాలేదు. 2023-2024 సంవత్సరానికి సంబంధించిన సీఎంఓ ఫైల్స్ (CMRF ఫైళ్ల) విచారణకు మాత్రమే వచ్చాం. కానీ ఓ ఆసుపత్రి వైద్యుడు విచారణకు సహకరించలేదు’’ అని స్పష్టం చేశారు. ఇక అధికారుల పరిశీలనల నేపథ్యంలో ఏ ఆసుపత్రిపైనైనా తదుపరి చర్యలు తీసుకుంటారో అన్నది సమయానుసారం తేలనుంది. కాగా, వైద్యసౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి సారించినప్పటికీ, ప్రజల అభ్యంతరాలు అధికారం తీసుకునే నిర్ణయాలపై ప్రభావం చూపుతాయేమో చూడాలి.
Admin
Aakanksha News