ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎఐసిసి సభ్యత్వానికి రాజీనామా చేసిన జగిత్యాల మాజీ ఎమ్మెల్యే టి. జీవన్ రెడ్డి రాజీనామా లేఖను ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. అనంతరం అయన మాట్లాడుతూ... బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై ఎంపీగా పోటీ చేయడం రాజకీయాల్లో తారుమారైన పరిస్థితులకు సంకేతమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి విమర్శించారు. ఇటువంటి నిర్ణయాల వల్లే సికింద్రాబాద్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల ప్రభావం ఆయన సొంత పార్లమెంట్ నియోజకవర్గమైన మహబూబ్నగర్పైనా పడిందని జీవన్ రెడ్డి అన్నారు. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం సీఎం నాయకత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.చేవెళ్ల ఎంపీ అభ్యర్థిత్వంపై తీసుకున్న నిర్ణయాలను కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు. తొలుత సునీతా మహేందర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించి, తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చెందిన రంజిత్ రెడ్డిని పార్టీలోకి తీసుకుని టికెట్ ఇవ్వడం వల్ల పార్టీకి నష్టం జరిగిందని అన్నారు. ఈ మార్పుల ప్రభావం చేవెళ్లతో పాటు సికింద్రాబాద్, మహబూబ్నగర్ స్థానాలపై పడిందని తెలిపారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. “రేవంత్ రెడ్డిని ఎదిరించి పోరాటం చేస్తాను.అణగదొక్కబడటం కంటే పోరాటం చేయడం మంచిది. పోరాటం చేస్తే నాకు పోయేది ఏముంది” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.అలాగే ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన పోచారం శ్రీనివాస్ రెడ్డి పై కూడా ఆయన ప్రశ్నలు సంధించారు. ఎవడయ్యా ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి? ఆయనకు కాంగ్రెస్ పార్టీతో ఏమిటి సంబంధం? బ్రతకడానికి వచ్చిన వ్యక్తికి ప్రభుత్వ సలహాదారు పదవి ఇవ్వడం సరైనదేనా? ఆయన ఇప్పటివరకు ఇచ్చిన సలహాలు ఏమైనా ఉన్నాయా?” అంటూ తీవ్రంగా విమర్శించారు.మొత్తానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు, నాయకత్వ నిర్ణయాలపై అసంతృప్తి బయట పడుతున్నట్లు జీవన్ రెడ్డి వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
Admin
Aakanksha News