ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు హైదరాబాద్లో నిర్వహించనున్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకునే క్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు సోమారపు లావణ్య అరుణ్కుమార్ను పోలీసులు గృహనిర్బంధం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే రామగుండం ప్రాంతానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలను కూడా ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.ఈ సందర్భంగా సోమారపు లావణ్య అరుణ్కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అరకొర పాలన, కమిషన్ల ఆధారిత వ్యవస్థపై ప్రజా సమస్యల తరఫున బీజేపీ పోరాటం చేస్తోందని పేర్కొన్నారు. అలాంటి ప్రజాస్వామ్య ఉద్యమాన్ని అడ్డుకునేందుకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిరోధించడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రజల కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నాయకులను, కార్యకర్తలను గృహనిర్బంధం చేయడం, అరెస్టులకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.హైదరాబాద్లో జరిగే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి హాజరుకాకుండా రామగుండం పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారని, ఇది అధికార దుర్వినియోగానికి నిదర్శనమని ఆమె ఆరోపించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం సాధించేదేమీ లేదని, ఇలాంటి చర్యలతో ప్రజా స్వరం ఆగిపోదని స్పష్టం చేశారు.ప్రజా సమస్యల పరిష్కారమే బీజేపీ లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ప్రజల కోసమే తమ పోరాటం కొనసాగుతుందని సోమారపు లావణ్య అరుణ్కుమార్ పేర్కొన్నారు. అవసరమైతే మరింత ఉధృతంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో చోటుచేసుకున్న ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Admin
Aakanksha News