ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : రామగుండంలోని సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (సిమ్స్)లో పాలనాపరమైన మార్పులు చోటుచేసుకున్నాయి. బయోకెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ నరేందర్ కొత్తగా కళాశాల ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ప్రిన్సిపాల్గా విధులు నిర్వహించిన డాక్టర్ హిమబిందును పదవి నుండి తప్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిమ్స్ నిర్వహణలో, ముఖ్యంగా పరిపాలనా వ్యవహారాల్లో అనేక అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న హిమబిందుపై గతంలోనూ అంతర్గత విచారణలు జరిగాయి. అయితే ఇటీవల మళ్లీ సిబ్బంది, వైద్యులు సమిష్టిగా ప్రిన్సిపల్ హిమబిందు వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రిన్సిపల్ హిమబిందు నిర్ణయాలు ఏకపక్షంగా, పాక్షికతతో ఉన్నాయని, కళాశాల అభివృద్ధి కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. ఇది ఇలా ఉంటే ఓ డ్రైవర్ నియామకాలు, కాంట్రాక్ట్ సేవలు, ఆసుపత్రి సామాగ్రి కొనుగోళ్లలోనూ చేతివాటం ప్రదర్శించి అవకతవకలకు పాల్పడినట్లు గతంలో ఎన్నో ఫిర్యాదులు వచ్చిన ఇప్పటివరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. సిమ్స్లో ఇటీవల గత కొన్ని నెలలుగా అసంతృప్తి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, ప్రభుత్వం తక్షణ చర్యగా హిమబిందును తప్పించి డాక్టర్ నరేందర్ను ప్రిన్సిపల్గా నియమించింది. ఈ మార్పును కొంత మంది సిబ్బంది, వైద్యులు, విద్యార్థులు సంతోషంగా స్వాగతించారు.కొత్త ప్రిన్సిపల్ డాక్టర్ నరేందర్ మాట్లాడుతూ... సిమ్స్ను రాష్ట్రంలో అగ్రశ్రేణి వైద్య విద్యాసంస్థగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. సిబ్బందంతా ఐక్యంగా పని చేస్తే అభివృద్ధి సాధ్యం అని తెలిపారు.ఇక హిమబిందు తొలగింపు నేపథ్యంలో ఆసుపత్రి సిబ్బంది మధ్య ఊరట వ్యక్తమవుతోంది. ఇకపోతే హిమబిందు తొలగింపుతో పాటు ఆమెపై ఉన్న అవినీతి ఆరోపణలపై మరింత దర్యాప్తు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. అధికార వర్గాలు ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నాట్లు ప్రచారం జరుగుతుంది. సిమ్స్ ప్రిన్సిపల్ మార్పుతో రామగుండం వైద్య వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఒకవైపు పరిపాలనలో పారదర్శకతకు కొత్త ఆరంభం అవుతుందనే ఆశాభావం వ్యక్తం అవుతుంది.అయితే, ఇప్పుడు మొత్తం దృష్టి కొత్త ప్రిన్సిపల్ డాక్టర్ నరేందర్ వైపు మళ్లింది. ఆయన నేతృత్వంలో సిమ్స్ మళ్లీ శాంతి, సమర్థత వైపు అడుగులు వేస్తుందని సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Admin
Aakanksha News