ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : సింగరేణి కార్మికుల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం గోదావరిఖని ప్రెస్క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం విధానాలను ఎత్తి చూపుతూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి లాభాల వాటా పంపిణీ విషయంలో ప్రభుత్వం అంకెల గారడీ చేస్తోందని స్పష్టం చేశారు. కార్మికులు రక్తం చెమటలతో సాధించిన లాభాలను కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందని ఆరోపించారు.గత ఏడాది నుంచి అభివృద్ధి పేరిట పక్కన పెట్టిన వేలాది కోట్ల రూపాయల వివరాలను ప్రభుత్వం దాచిపెడుతోందని, వెంటనే వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరుతో మోసగించి, కార్మికుల భవిష్యత్తును కుంభకోణాల బారిన పడేస్తున్నారని ఆరోపించారు. సింగరేణి కార్మికులు చేసిన త్యాగాలు, వారి కృషిని గుర్తించి, సరైన లాభాలను పంచడం బదులు ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం అంకెల గారడీ చేస్తోందని మండిపడ్డారు. కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పడేస్తోందని విమర్శించారు. ముఖ్యంగా వారసత్వ ఉద్యోగాల కల్పన, మెరుగైన వైద్య సదుపాయాలు, సురక్షిత వాతావరణం వంటి అంశాల్లో ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన బదులు కొత్త కొత్త వాగ్దానాలతో మభ్య పెడుతోందని ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని అన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని కోరుతూ, ఆ హామీలు అమలుకాకపోతే ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను అణచివేయడానికి ప్రయత్నిస్తే తీవ్రస్థాయి పోరాటం జరుగుతుందని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల హక్కులను ఒక్కొక్కటిగా హరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా ఎదిరిస్తామని ఆయన తెలిపారు.ప్రజలు, కార్మికులు కలిసి పోరాడితే ఏ ప్రభుత్వం అయినా తలవంచక తప్పదని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఈ ఉద్యమం కేవలం కార్మికుల కోసమే కాదు, సింగరేణి భవిష్యత్తు కోసం జరుగుతోందని, న్యాయం సాధించే వరకు ఈ పోరాటం ఆగదని చందర్ స్పష్టం చేశారు.
Admin
Aakanksha News