Friday, 16 January 2026 09:23:23 AM

ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థానం ఈవోకు కమిషనర్ నోటీసులు...

దరఖాస్తుపై సరైన సమాచారం ఇవ్వలేదన్న కారణంగా విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ...

Date : 17 June 2025 09:21 PM Views : 544

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి జిల్లా ఓదెలలోని ప్రముఖ దైవ పుణ్యక్షేత్రమైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు సమాచార హక్కు చట్టంలోని విభాగాల మేరకు తెలంగాణ సమాచార కమిషనర్‌ నోటీసులు జారీ చేశారు. ఈనెల 23న హైదరాబాదులో కమిషన్ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే, ఓదెల మండల కేంద్రానికి చెందిన నాగపురి రవి అనే వ్యక్తి 2020 డిసెంబర్ 23 నుండి 2021 అక్టోబర్ 21 వరకు ఓదెలలో ఉన్న చీకటి ఆంజనేయస్వామి దేవాలయం, భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం, రామచంద్ర స్వామి ఆలయాలకు సంబంధించిన భూముల వివరాలు, వాటి విస్తీర్ణం, పాస్‌బుక్‌లు, అలాగే ఈ దేవాలయాలలో పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగుల వివరాలు, వారికి చెల్లిస్తున్న జీతభత్యాలు వంటి అంశాలపై సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోరారు.అయితే ఆలయ ఈవో ఈ సమాచారాన్ని అందించడంలో విఫలమయ్యారు. ఆపై నాగపురి రవి అసిస్టెంట్ కమిషనర్ (ఎఈసీ), కరీంనగర్ మరియు డిప్యూటీ కమిషనర్, వరంగల్ అధికారులకు కూడా సమాచార అభ్యర్థనను పంపినప్పటికీ, అక్కడి నుంచి కూడా తగిన సమాచారం రాలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.దీంతో సమాచార కమిషనర్ కార్యాలయం ఈ వ్యవహారాన్ని పరిశీలించి, ఆలయ ఈవో ప్రవర్తన సమాచార హక్కు చట్టానికి విరుద్ధమని భావించి ఈనెల 23న కమిషన్ విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది.ఈ ఘటనపై స్థానికంగా చర్చ నడుస్తోంది. ప్రజాధనం ఆధారంగా నడిచే ఆలయాల పరిపాలనలో పారదర్శకత ఉండాలని ప్రజలు ఆశిస్తున్నారని, ఇటువంటి వ్యవహారాలు బాధ్యతారాహిత్యాన్ని నిశ్చితంగా సూచిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఇక దేవస్థానం అధికారుల వైఖరిపై కమిషనర్ ముందు విచారణ అనంతరం మరిన్ని చర్యలు ఉండే అవకాశముందని న్యాయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :