ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : రామగుండం నగరపాలక సంస్థలో ట్రాన్స్ఫర్ డ్యూటీ ఫండ్స్కు సంబంధించి ఏడు ప్యాకేజీల టెండర్లను అధికార పార్టీ నేతల అండదండలతో కాంట్రాక్టర్లు కుమ్మక్కై దక్కించుకున్నారని కార్పొరేషన్ 25వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు తీవ్ర ఆరోపణలు చేశారు. సుమారు రూ.1313.70 కోట్ల నిధుల విషయంలో కాంట్రాక్టర్ల ముఠా ఏర్పడి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు సంబంధించి స్థానిక మున్సిపల్ ముఖ్య అధికారి, అధికార పార్టీ నాయకులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారని పేర్కొన్నారు. అతి తక్కువ శాతంలోనే టెండర్లు కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం ద్వారా కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు. ఆర్సీసీ పైపులు ఉపయోగించాల్సిన చోట మట్టి పైపులు అమర్చేలా మార్పులు చేసి కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చారని విమర్శించారు.ఈ అంశంపై వివరణ కోరగా నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నిర్లక్ష్య సమాధానాలు ఇస్తూ రాజకీయ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని అన్నారు. గతంలో ఇలాంటి టెండర్ల ద్వారా ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చేదని కానీ ఈసారి కేవలం ఒక శాతం పర్సంటేజ్తోనే టెండర్లు కాంట్రాక్టర్లకు దక్కించుకోవడం అవినీతికి నిదర్శనమని ప్రశ్నించారు.అధికార పార్టీ నేతల అండదండలతో కాంట్రాక్టర్లకు లాభదాయకంగా వ్యవహారం సాగుతుందని, ఎవరైనా ఎదిరిస్తే బెదిరింపులు ఎదురవుతున్నాయని సుమలత రాజు ఆరోపించారు. కోటిన్నర రూపాయలు ఎవరెవరి జేబుల్లోకి చేరాయో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. అవినీతి నేతల చేతుల్లో అధికారులు జెలగలుగా మారారని ఆమె మండిపడ్డారు. ఈ అవకతవకలపై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని, విజిలెన్స్ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సుమలత రాజు డిమాండ్ చేశారు. సిడిఎమ్ఎస్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు.గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు చెల్లించని బిల్లుల కోసం, మెయింటెనెన్స్ వర్కర్ల జీతాల కోసం, అత్యవసర పరిస్థితుల్లో డీడీ రూపంలో నిల్వ ఉంచాలని నిధులు కేటాయించినప్పటికీ, ప్రస్తుత అధికారులు వాటిని పట్టించుకోకుండా కొత్త అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల పేరిట అవినీతి బాటలో నడుస్తున్నారని మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు ఆరోపించారు.
Admin
Aakanksha News