ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : బిడ్డ చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు... ఇద్దరు అంధులకు కంటి చూపును ప్రసాధించడానికి ఆమె నేత్రాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు. గోదావరిఖని పవర్ హౌజ్ కాలనీకి చెందిన చుంచు విఠల్, బస్ స్టాండ్ ముందు జ్యోతి టీ స్టాల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసిన విఠల్, నిర్మల దంపతులు.. పీజీ చదివిన చిన్న కూతురు ప్రత్యూష(26)కు కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలని ఆశపడ్డారు. అందరితో అన్యోన్యంగా ఉండే ప్రత్యూష, మంగళవారం రాత్రి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బిడ్డ అకాలమరణంతో తల్లిదండ్రులతోపాటు మృతురాలి అక్కలు, బావలు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రత్యూష నేత్రాలను దానం చేస్తే ఇద్దరు అంధులకు కంటి చూపును ప్రసాదించ వచ్చని, ఇద్దరు అంధులతో ఈ లోకాన్ని ఆమె కళ్ళు సజీవంగా చూస్తూనే ఉంటాయని తల్లితండ్రలకు సదాశయ ఫౌండేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కే.ఎస్.వాసు అవగాహన కల్పించారు. దీంతో స్పందించిన కుటుంబ సభ్యులు ప్రత్యూష నేత్రాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు. దీంతో ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ సీనియర్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సహకారంతో ప్రత్యూష నేత్రాలను సేకరించి, హైదరాబాదుకు తరలించారు. అనంతరం ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ నుంచి వచ్చిన అభినందన పత్రాన్ని వన్ టౌన్ ఎస్సై భీమేష్ చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేసి అభినందించారు. విషాదంలో కూడా మరో ఇద్దరు అంధులకు వెలుగులు పంచడానికి నేత్రదానం చేయడానికి ముందుకు కుటుంబ సభ్యులను సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు టి.శ్రవణ్ కుమార్, లింగమూర్తి, మెరుగు భీష్మాచారి, గౌరవ అధ్యక్షుడు సానా రామకృష్ణారెడ్డి, సలహాదారులు నూక రమేశ్, ప్రచార కార్యదర్శి కే.ఎస్.వాసు, జిల్లా మహిళా అధ్యక్షురాలు వెల్ది కవిత అనంతరాములు, పట్టణ కార్యదర్శి బోళ్ల చంద్రశేఖర్, రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పి.మల్లికార్జున్ తదితరులు అభినందించారు. ఆమె మృతి పట్ల సంతాపం తెలిపి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
Admin
Aakanksha News