ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన దివంగత పుట్ట నారాయణ 47 వ వర్ధంతి గోదావరిఖని మార్కండేయ కాలనీ గణేష్ నగర్ స్నేహ సాహితి సిద్దార్థ హైస్కూల్ దగ్గర స్వగృహంలో ఈనెల 5న నిర్వహించనున్నట్లు ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. ఈమేరకు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో మంగళవారం వర్ధంతి కరపత్రాలను సంఘాల నాయకులు విడుదల చేశారు. ఈసందర్భంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమార స్వామి మాట్లాడుతూ 1978 లో గోదావరిఖనిలో జరిగిన బందు సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో 23 ఏళ్ళ సింగరేణి కార్మికుడు పుట్ట నారాయణ బలయ్యాడని అన్నారు. అప్పట్లో మృతుడు నారాయణ కుటుంబాన్ని ఆదుకుంటామని ఇచ్చిన హామీ నేటికీ అమలుకు నోచుకోలేదన్నారు. నాలుగు దశాబ్దాలుగా మృతుని కుటుంభం సింగరేణి యాజమాన్యంపై న్యాయ పోరాటం చేస్తోందని, నారాయణ కుటుంబంలోకి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 5న నిర్వహించే వర్ధంతి సభకు ప్రజా సంఘాల నాయకులు తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీపతి రాజగోపాల్, విరసం ఉమ్మడి జిల్లా కన్వీనర్ బాలసాని రాజయ్య, పౌరహక్కుల సంఘం నాయకులు బొంకూరి లక్ష్మన్, సత్యనారాయణ, పుట్ట రాజన్న, రెడ్డిరాజుల సంపత్ పాల్గొన్నారు.
Admin
Aakanksha News