ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నిన్న చోటుచేసుకున్న మైసమ్మ తల్లి గుడుల కూల్చివేత ఘటనపై రాజకీయ వాతావరణం తీవ్రంగా మారింది. అధికారులు ఎమ్మెల్యేకి తెలియకుండా కూల్చివేతలు చేపట్టరని అనడం హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు నీరటి శ్రీనివాస్ ఆరోపించారు. ఈ ఘటనను అధికారుల అతి ఉత్సాహం, నిర్లక్ష్య ధోరణిగా పేర్కొనడం పై ఆయన మండిపడ్డారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న మైసమ్మ గుడులను ఎమ్మెల్యే కు సమాచారం ఇవ్వకుండా కూల్చడం దారుణం. ఇది ప్రజల మనోభావాలకు దెబ్బతీసే చర్య అని ఎమ్మెల్యే కు తెలియకుండా ఇటువంటి చర్యలు తీసుకునే అధికారులు ఎవరు? ప్రజాప్రతినిధికి సమాచారం ఇవ్వకుండా దేవాలయాలపై దాడి చేయడం ఏ విధమైన పరిపాలన?” అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే నిజాయితీ గల వ్యక్తి అయితే వెంటనే స్పందించాలని హిందూ ధర్మం కోసం పోరాడుతున్న ప్రజలకు మీరు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కూల్చివేతలలో పాల్గొన్న అధికారులను తక్షణమే సస్పెండ్ చేయడమే కాకుండా, వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు తీర్పు అందరికీ సమానం కానీ తీర్పు పేరుతో ప్రజల భక్తిని తొక్కేయడం అంగీకారంలేని విషయం. మీరు నిజాయితీగల వ్యక్తి అయితే హిందూ సమాజం ఎదుట మీ స్థానం నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.సుప్రీం కోర్టు తీర్పుపై ఎమ్మెల్యేకి ఉన్న అధిక ప్రేమ ఎందుకో ప్రజలకు చెప్పాలని అన్నారు. నాకు సమాచారం లేదు’ అనడం అంటే ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నట్లా? లేనట్లా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా అధికారులు చేసే ఇలాంటి చర్యలు మతపరమైన ఉద్రిక్తతలకు దారి తీస్తాయని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు ఇలాంటి ఘటనలపై జాగ్రత్తగా వ్యవహరించాలని, భక్తి కేంద్రాలను కూల్చివేసి ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయకూడదని సూచించారు. హిందూ దేవాలయాల పట్ల గౌరవం చూపాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.ఈ సంఘటన నేపథ్యంలో రామగుండం పరిసర ప్రాంతాల్లో భక్తుల్లో ఆగ్రహం నెలకొంది. మైసమ్మ తల్లి గుడుల కూల్చివేతను ఖండిస్తూ స్థానికులు పెద్ద సంఖ్యలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నేతలు కూడా ఈ ఘటనపై విభిన్నంగా స్పందిస్తూ, అధికారుల వైఖరిపై విమర్శలు గుప్పిస్తున్నారు.భక్తి భావనకు భంగం కలిగించే ఇలాంటి చర్యలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకపోతే ప్రజా వ్యతిరేకత తీవ్రరూపం దాల్చుతుందని నీరటీ శ్రీనివాస్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.
Admin
Aakanksha News