ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : రామగుండం కార్పొరేషన్ 25వ డివిజన్లో పారిశుద్ధ్యంపై అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత వినూత్న నిరసన చేపట్టారు. పారిశుద్ధ్య సిబ్బంది పనితీరు పట్ల విసుగు చెందిన ఆమె స్వయంగా ద్విచక్ర వాహనంపై ఇంటింటికీ తిరుగుతూ చెత్తను సేకరించి తన డివిజన్లో ఏర్పడిన అసౌకర్యాలను ప్రతిబింబించేందుకు ప్రయత్నించారు.గత నెల రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరవడం లేదని ఆరోపించిన ఆమె, రోడ్లపై చెత్త కుప్పలుగా పేరుకుపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి వీధులన్నీ చిత్తడిగా మారి, పాములు, విషపూరిత పురుగులు సంచరిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని వివరించారు. కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అధోగతికి గురైందని, ఫాగింగ్ చేపట్టకపోవడం వల్ల దోమలు పెరిగి జ్వరాలు, వ్యాధుల భయాలు పెరిగాయని తెలిపారు. డివిజన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, కార్పొరేషన్ అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.ఇక్కడ అధికార పార్టీకి చెందిన నేతల డివిజన్లకే అధికారులు పూర్ణ సహకారం అందిస్తున్నారు. మిగిలిన డివిజన్లకు కనీస అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం లేదు. అధికార పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకునేందుకే పనిచేస్తున్నారే తప్ప ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి లేదు" అని ఆమె ఆరోపించారు.తమ డివిజన్ను గుంపుగానే చూస్తున్న అధికారుల తీరుపై దశలవారీగా పెద్దస్థాయిలో ప్రజలతో కలిసి నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోకపోతే మరింత ఉదృతమైన ఆందోళనలకు దిగుతామని ఆమె స్పష్టం చేశారు.lసుమలత చేపట్టిన ఈ వినూత్న నిరసన ప్రస్తుతం కార్పొరేషన్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజలుకే ప్రజాప్రతినిధులు స్వయంగా క్లీనర్లు అవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది అన్నదానిపై అధికార యంత్రాంగం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు.
Admin
Aakanksha News