Monday, 10 August 2026 03:12:22 PM

పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి.... జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

అంగన్ వాడి కేంద్రాలలో పిల్లల ఎదుగుదలను ప్రత్యేక్షంగా పర్యవేక్షించాలి

Date : 26 September 2024 03:31 PM Views : 481

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / పెద్దపల్లి జిల్లా : ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు మెరుగైన విద్య అందించాలని, ఆ దిశగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి మండలంలో పలు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హన్మంతునిపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడి కేంద్రం, ముత్తారం గ్రామంలో అప్పర్ ప్రైమరీ స్కూల్, అంగన్వాడి కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. హన్మంతునిపేట పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివింది అర్థం చేసుకునేలా విద్యార్థుల గ్రహణ శక్తి మెరుగయ్యేలా చూడాలని అన్నారు. పాఠశాలలో మరమ్మత్తుకు గురైన కంప్యూటర్లను తొలగించాలని, విద్యార్థులకు మధ్యాహ్నం నాణ్యమైన భోజనం అందజేయాలని కలెక్టర్ తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు సకాలంలో హాజరు కావాలని, పాఠశాల ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ తెలిపారు. హన్మంతునిపేట అంగన్ వాడి కేంద్రంలో లైట్లు వెంటనే ఏర్పాటు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ముత్తారం గ్రామం లోని అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థుల పరిజ్ఞానాన్ని కలెక్టర్ పరీక్షించారు. ప్రతి విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు మెరుగు పర్చేందుకు లక్ష్యాల నిర్దేశించుకోవాలని కలెక్టర్ తెలిపారు. అంగన్వాడి కేంద్రం పరిశీలించిన కలెక్టర్ మరో భవనం లోకి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అంగన్ వాడి కేంద్రాలలో ఉన్న పిల్లల ఎదుగుదలను రెగ్యులర్ గా మానిటర్ చేయాలని, ఎత్తు తక్కువ, బరువు తక్కువ ఉన్న పిల్లలను గుర్తించి వారికి అవసరమైన అదనపు పౌష్టికాహారం అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ తనిఖీ సమయంలో పాఠశాల హెడ్ మాస్టర్ లు జి. దశ రథం, పి.నాగరాజు, ఉపాధ్యాయులు, సంపత్ రెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :