ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : ఈ నెల 15,16 వ తేదీలలో TGPSC ఆధ్వర్యంలో జరగనున్న గ్రూప్-II పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్ -2023 (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో వుంటుందని రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్. ఒక ప్రకటనలో తెలిపారు.రామగుండం పోలీస్ కమీషనరేట్ వ్యాప్తంగా మొత్తం 23,969 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని అందులో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 18 పరీక్షా కేంద్రాలలో 9018,మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 48 పరీక్షా కేంద్రాలలో 14,951 మంది హాజరు కానున్నారు. పరీక్షా కేంద్రాలలో నిర్వహించే గ్రూప్-II పరీక్షల సందర్భంగా డిసెంబర్ 15 ఉదయం 6:00 గంటల నుంచి డిసెంబర్ 16 సాయంత్రం 6:00 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు 300 మీటర్ల దూరంలో గుంపులుగా వుండరాదని, ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డిజేలతో ఉరేగింపులు, ధర్నాలు, ప్రచారాలకు అనుమతి లేదని పేర్కొన్నారు. పరీక్షా సమయంలో పరిసరాలలోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు మూసివేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. అదే విధంగా పరీక్షా సమయంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163 BNSS సెక్షన్ అమలు చేస్తున్నట్లు సీపీ తెలిపారు.పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో పోలీస్ పెట్రోలింగ్ పార్టీలను నియమించినట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీపీ తెలిపారు.
Admin
Aakanksha News