ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సవ సభల పేరిట ప్రజాదనాన్ని దుర్వినియోగం చేస్తుందని, ఏం సాధించారని విజయోత్సవ సభలు జరుపుకుంటారని భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి పార్లమెంటు కో కన్వీనర్ గుండబోయిన లక్ష్మణ్ యాదవ్ అన్నారు. హైడ్రా పేరిట పేద ప్రజల ఇండ్లను కూలగొడుతూ ఈ రాష్ట్రాన్ని స్మశానంగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేతగాని మరొకసారి అర్థమైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నందుకు జరుపుకుంటున్నారా ఈ విజయోత్సవ ప్రజాపాలన సభలను అని ఎద్దేవా చేశారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ పూర్తిగా చేయలేదని, భరోసా పేరిట ఎకరానికి 15వేల రూపాయలు ఇస్తామని రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఎన్నికల సమయంలో 6 గ్యారంటీల పేరిట ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా ప్రజలను అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. 6 గ్యారంటీలు 66 తప్పుడు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు.నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేసిందని రానున్న రోజుల్లో ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ కో కన్వీనర్ గుండబోయిన లక్ష్మణ్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు.
Admin
Aakanksha News