ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : సింగరేణి కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం నయవంచనకు గురి చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సింగరేణి నిరాహారదీక్ష కార్యక్రమన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ... ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. అలాగే సింగరేణికి వచ్చిన నికర లాభాల నుండి 33శాతం కార్మికులకు చెల్లించకుండా కేవలం 16శాతం మాత్రమే కార్మికులకు చెల్లించి కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. స్వయంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మీడియా సమావేశంలో సింగరేణి లాభాల వాటను ప్రకటించారని దాని ప్రకారమే కార్మికులకు లాభాల వాటా చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. సింగరేణికి 4వేల 7వందల 1 కోటి రూపాయల నికర లాభాలు వస్తే 24వందల 12 కోట్ల రూపాయలను మాత్రమే కార్మికులకు పంచారని అన్నారు. మిగతా డబ్బులను ప్రభుత్వం ఎందుకు పక్కన పెడుతుందని దేనికి ఖర్చు చేస్తారని ఆయన ప్రశ్నించారు. దీంతో లాభాల వాటలో సింగరేణి కార్మికులు ఎంతో నష్టపోతున్నారని పేర్కొన్నారు. గతంలో కంటే సింగరేణికి అధిక లాభాలు ఎక్కువ వచ్చినప్పటికీ ప్రభుత్వం కార్మికులకు చెల్లించడం లేదన్నారు. ఇప్పటికే అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మికులను కూడా మోసం చేస్తుందన్నారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఎవరు ఎటువంటి కార్యక్రమాలు చేసిన ఎవరిని మేము ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. కార్మిక క్షేత్రంలో కార్మికులకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించడానికి కార్యక్రమాన్ని నిర్వహిస్తే పోలీస్ యంత్రాంగం చేయొద్దు అని అడ్డుకుంటుందని, మరి అన్యాయం జరిగింది అని చెప్పడానికి ఎవరిని ప్రశ్నించాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఉపముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా నికర లాభాల వాటాలో నుంచి 33శాతం సింగరేణి కార్మికులకు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, నడిపెల్లి దివాకర్ రావు, పుట్ట మధుకర్, కార్మిక సంఘం నాయకులు మిర్యాల రాజిరెడ్డి, మాదాసు రామ్మూర్తి, పర్లపల్లి రవి, వడ్డేపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు
Admin
Aakanksha News