ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పుతో స్పష్టమైన సందేశం ఇచ్చారు. గతంలో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల అభిమానం, విశ్వాసం పొందిన సుంకరి మహేందర్ (మహేష్) మళ్లీ సర్పంచ్గా ఘన విజయం సాధించారు. ఇద్దరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇస్తూ, 73 ఓట్ల విశేష మెజారిటీతో గెలుపొంది ముస్త్యాలలో రాజకీయ చర్చలకు కొత్త ఊపిరి నింపారు.ముస్త్యాల గ్రామ ప్రజలు గతంలో మహేందర్ను గెలిపించిన తరువాత ఆయన చేపట్టిన అభివృద్ధి పనులు గ్రామంలో శాశ్వత ముద్ర వేసాయి. గ్రామ పంచాయతీ భవన అభివృద్ధి, రోడ్డు మరమ్మత్తులు, తాగునీటి సమస్యల పరిష్కారం, వీధుల దీపాల ఏర్పాటు, రైతుల కోసం చేపట్టిన చిన్నపాటి సాగు నీటి పనులు…ఇవన్నీ గ్రామ ప్రజలకు ఆయనపై మళ్లీ నమ్మకం కలిగించే అంశాలయ్యాయి.ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు విన్నవించుకుని వెంటనే స్పందించే నాయకుడిగా మహేందర్ పేరు తెచ్చుకున్నట్లు గ్రామంలోని పెద్దలు తెలిపారు. అదే విశ్వాసం ఓటు పెట్టే సమయంలో ప్రజలను ఆయనవైపు మళ్లించినట్లు రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి.ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలవడంతో గ్రామంలో పోటీ హోరాహోరీగా మారింది. అధికార పార్టీ ప్రభావం,ప్రచారం, వర్గ పోరాటం ప్రజలు చివరికి అభివృద్ధి, నమ్మకం మార్గాన్నే ఎంచుకున్నారు.సుంకరి మహేందర్ 73 ఓట్ల స్పష్టమైన మెజారిటీతో ఈ ఇద్దరిపై గెలవడం ఇప్పుడు గ్రామంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. కఠినమైన పోటీ ఉన్నప్పటికీ అభివృద్ధిని ప్రమాణంగా తీసుకుని ప్రజలు తమ నిర్ణయం చెప్పారనడంలో ఎటువంటి సందేహం లేదు.
గెలుపు ప్రజలది – పని నా బాధ్యత” : మహేందర్
ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మహేందర్ గ్రామస్తులకు ధన్యవాదాలు తెలుపుతూ…ఇది నా విజయం కాదు… మా ముస్త్యాల ప్రజల విజయం. భవిష్యత్తులో మరింత కృషి చేస్తాను. గ్రామం అభివృద్ధి ఒక నిరంతర ప్రయాణం, ఆ దారిలో ఎప్పటికప్పుడు ముందుకు తీసుకెళ్తాను” అని ప్రకటించారు. ఫలితాలు ప్రకటించగానే ముస్త్యాల గ్రామం పండుగ వాతావరణంలో మునిగి పోయింది. మహిళలు హర్షధ్వానాలు చేస్తూ, యువకులు బాణసంచా పేల్చుతూ, పెద్దలు తలపాగా కట్టించి మహేందర్కు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని ప్రధాన వీధులన్నీ అతని అనుచరులతో కిటకిటలాడాయి. ఈసారి జరిగిన ఎన్నికలు ముస్త్యాల్లో కేవలం రాజకీయ పోటీ కాదు… ప్రజలు ఎవరిని విశ్వసిస్తున్నారు, ఎవరు నిజంగా గ్రామానికి సేవ చేస్తారనే విషయాన్ని స్పష్టంగా సూచించే తీర్పు.సుంకరి మహేందర్ విజయం ప్రజల నమ్మకానికి నిదర్శనం.అభివృద్ధి పట్ల అంకితభావంతో ముందుకు సాగుతున్న నాయకత్వానికి ఇది మరో ముద్ర అని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Admin
Aakanksha News