ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : కమాన్పూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ సాధారణ స్థానానికి మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన ఈసారి ఎన్నికల్లో విశేషం ఏమిటంటే… 11 మంది పురుషులకు పోటీగా ఒక్క మహిళా అభ్యర్థి మాత్రమే రంగంలోకి దిగి ప్రతి ఇంటా చర్చనీయాంశమవుతోంది. ఆ మహిళే గులుగం జ్యోతి అయితే ఆర్యవైశ్య కమ్యూనిటీకి చెందిన, పీజీ చదివిన విద్యావంతురాలు, ఎస్ఆర్ఆర్ కంగన్ హాల్ నిర్వాహకురాలైన జ్యోతి — పార్టీ బలం లేకున్నా, ధన బలం లేకున్నా ప్రజల నమ్మకమే తన బలం అంటూ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ప్రజాసేవ పట్ల ఉన్న ఆసక్తి, గ్రామం కోసం పనిచేయాలనే తపనతో ఎన్నికల బరిలోకి రావాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆమె నామినేషన్ దాఖలు చేసిన దగ్గర నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి. “ఎందుకు నామినేషన్ వేశావు..? వెంటనే విత్డ్రా తీసుకో” అంటూ ఫోన్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు చెప్పినట్టు జ్యోతి పేర్కొన్నారు. ప్రచారానికి ఎవరిని పంపినా చుడమని కూడా ధమ్కీలు వస్తుండటం ఆమెను, ఆమె అనుచరులను కలవర పెడుతోంది. అయినప్పటికీ వెనుదిరగకుండా ధైర్యంగా ముందుకు సాగుతోంది. ఎన్నికల అధికారులు ఆమెకు ‘ఫుట్బాల్’ గుర్తు కేటాయించగా, గ్రామం నలుమూలలా అదే గుర్తును ప్రజలకు వివరించి తనదైన శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నారు. “మందు సీసాకు... పచ్చ నోటుకు ఓటును అమ్ముకొంటే అభివృద్ధి అడిగే హక్కు కోల్పోతాం” అని చెప్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు. గ్రామాభివృద్ధి కోసం, స్వచ్ఛమైన పాలన కోసం, కొత్త మార్పు కోసం ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరుతూ ప్రచారంలో ముందుకు సాగుతున్న జ్యోతి— ఈ ఎన్నికల్లో కమాన్పూర్లో సరికొత్త చర్చకు కేంద్రబిందువై మారారు.
Admin
Aakanksha News