ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : ప్రభుత్వం నిర్దేశించిన పరీక్ష ఫీజుల కంటే అదనంగా విద్యార్థుల నుండి వేల రూపాయలను కొన్ని ప్రైవేటు పాఠశాలలు వసూళ్లు చేస్తూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పెద్దపల్లి జిల్లా గోదావరిఖని అయోధ్య నగర్లోని ఓ ప్రైవేట్ పాఠశాల ఒకటో తరగతి విద్యార్థుల నుండి రూ.500 పరీక్ష ఫీజు వసూలు చేయడం స్థానిక తల్లిదండ్రుల్లో ఆగ్రహం రేకెత్తించింది. ఒకటో తరగతికి పరీక్ష ఫీజు అనే పద్ధతి లేదని చెప్పుకుంటూనే, అదే పేరుతో డబ్బులు తీసుకోవడం పాఠశాల యాజమాన్యం తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చిన్నారుల చదువు పేరుతో ఇలాంటి వసూళ్లు చేయడం ఎంతవరకు సముచితం అనే ప్రశ్న గోష పడుతోంది.ఇదే సమయంలో గోదావరిఖని ఎన్టీపీసీ పరిధిలోని మరో ప్రైవేట్ పాఠశాల పదో తరగతి పరీక్షల పేరుతో ప్రతి విద్యార్థి నుండి రూ.2700 వసూలు చేస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ నిర్ణయించిన ఫీజు పరిమితులను పట్టించుకోకుండా, స్వేచ్ఛగా రుసుములు విధించడం విద్యార్థుల కుటుంబాలను ఆర్థికంగా పడగొడుతోందని వారు మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలలో ఉచిత పరీక్షలు జరుగుతుండగా, ప్రైవేట్ పాఠశాలల్లో ఈ భారీ ఫీజులు ఏ ఆధారంపై వసూలు చేస్తున్నారని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.జిల్లాలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యమే ఈ దోపిడీకి కారణమా? లేక అధికారులకు సమాచారం ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేస్తున్నారా? అనే అనుమానాలు తల్లిదండ్రులలో వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చిన్నారుల విద్య పేరుతో ఆర్థిక భారం మోపే పాఠశాలలకు చెక్ పెట్టే సమయం వచ్చిందని, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటం విద్యాశాఖ బాధ్యత అని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. విద్యాశాఖ అధికారుల తీరుపై అనుమానాలు ఎన్నో... గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో అనుమతి లేకుండా కొంతమంది పాఠశాలలను నిర్వహించడమే కాకుండా వారి తల్లిదండ్రుల నుండి ఫీజుల పేరుతో ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్న సంబంధిత పాఠశాలలపై చర్యలు తీసుకునే అధికారులే కరువయ్యారని పలువురు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. గోదావరిఖని అయోధ్య నగర్ లో ప్రభుత్వ పాఠశాలకు అతి సమీపంలో ఓ ప్రైవేట్ పాఠశాలలను నెలకొల్పడమే కాకుండా ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తూ ఒకటవ తరగతికి కూడా 500 రూపాయల పరీక్ష ఫీజును వసూళ్లు చేసిన ఘనత పాఠశాలకే దక్కింది. మరి ఒకటో తరగతి పరీక్ష ఫీజును తీసుకోమని ఏ ప్రభుత్వం ఆ పాఠశాలకు అనుమతి ఇచ్చిందో అర్థం కావడం లేదని కొంత మంది తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరేత్తనట్లు ఉండడం వల్లే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఇటువంటి ఆర్థిక దోపిడీ పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా దీనిపై జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి సదురు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని అలాగే ప్రైవేట్ పాఠశాలలు దోపిడీకి పాల్పడుతున్న పట్టించు కోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యాశాఖ అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Admin
Aakanksha News