Wednesday, 13 May 2026 05:38:14 PM

విప్లవ ప్రస్థానానికి.. విరామం ప్రకటిస్తున్న మావోయిస్టు అగ్ర నేతలు....మావోయిస్టు ఉద్యమానికి వరుస దెబ్బలు...

తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న రేపు ఛత్తీస్‌గఢ్ సీఎం ముందు లొంగబాటు...

Date : 15 October 2025 09:02 PM Views : 537

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : ఒకప్పుడు ఎర్ర జెండాలతో భయాన్ని ప్రేరేపించిన అరణ్యాలు, ఇప్పుడు పచ్చని అభివృద్ధి చిహ్నాలుగా మారుతున్నాయి. వరుస లాగుబాటులు ఆ దిశలోని పెద్ద సంకేతమని చెప్పవచ్చు. తెలంగాణ అరణ్యాల్లో శాంతి స్వరాలు మెల్లగా మారుమ్రోగుతున్నాయి. ఇది కొత్త ఆరంభానికి సంకేతం...వారిని ప్రభుత్వం శాంతియుత జీవితం వైపుకు మళ్లించడం, అరణ్యాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం కీలకంగా మారింది. లొంగిపోయిన మావోయిస్టుల చేతిలోని తుపాకీలు ప్రభుత్వ భద్రతా బలగాల ముందు సమర్పించబడుతున్నాయి. వారి నినాదాలు “రక్తపాతం కాదు, శాంతి కోసం” అని ఉండటం, పాత విధానాల నుంచి మార్పు చెందిన సంకేతం అని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు.తెలంగాణ మరియు ఛత్తీస్‌గఢ్ అరణ్యాలకేంద్రంలో దశాబ్దాలుగా కొనసాగిన మావోయిస్టు ఉద్యమం ఇప్పటి వరకు చట్టబద్ధమైన భద్రతా దృష్టికోణం, ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, స్థానిక ప్రజల సహకారం కారణంగా ఒక ప్రత్యేక దశకు చేరింది. ఒకప్పుడు ఎర్ర జెండాలతో, భయభీతితో భద్రతా బలగాలను ఎదుర్కొన్న మావోయిస్టులు, ఇప్పుడు సాధారణ జీవితం, శాంతి దిశలో అడుగులు వేస్తున్నారు.ఈ క్రమంలోనే మావోయిస్టు ఉద్యమానికి మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఎర్రదళాలకు గత కొన్ని వారాలుగా వరుస షాక్‌లు తగులుతుండగా, తాజాగా మరో అగ్రనేత లొంగిపోనున్నట్లు సమాచారం లభించింది. తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్‌ ఆశన్న రేపు ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి ముందు అధికారికంగా లొంగిపోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలను సమన్వయం చేస్తూ సుదీర్ఘకాలం పాటు కీలకపాత్ర పోషించిన ఆశన్న, గత కొన్ని నెలలుగా పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర కమిటీ ఆదేశాలు, గ్రౌండ్ రియాలిటీ మధ్య విస్తరిస్తున్న అంతరం, మావోయిస్టు నాయకత్వం లోపించిన వ్యూహం కారణంగా ఆయన లొంగిపోనే నిర్ణయం తీసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు.ఆశన్నతో పాటు దాదాపు 70 మంది మావోయిస్టులు కూడా ఆయుధాలు వీడి లొంగబాటుకు సిద్ధమవుతున్నారు. వీరిలో ఎక్కువ మంది ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా, బీజాపూర్‌, నారాయణపూర్‌ ప్రాంతాలకు చెందినవారుగా సమాచారం. ఇదే సమయంలో, ఇప్పటికే మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు మహారాష్ట్రలో గడ్చిరోలి పోలీసుల ముందు నిన్న అధికారికంగా లొంగిపోయిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మొత్తం 61 మంది మావోయిస్టులు తమ చేతిలో ఉన్న 54 ఆయుధాలను సమర్పించి ప్రధాన ప్రవాహంలో చేరారు. ఈ లొంగుబాటు కార్యక్రమాన్ని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా ప్రకటించడం విశేషం. మల్లోజుల గత కొన్ని రోజులుగా ప్రభుత్వానికి పంపిన లేఖలలో మావోయిస్టు సిద్ధాంతం పాతబడి పోయిందని, యువతకు భవిష్యత్‌ లేదు అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. దాంతోపాటు సమాజంలో తిరిగి చేర్చుకోవాలని, శాంతి మార్గంలో కొనసాగాలని తన నిర్ణయాన్ని స్పష్టంగా పేర్కొన్నాడు.మల్లోజుల లొంగుబాటు తరువాతే ఆశన్నతో పాటు మరి కొంతమంది అగ్రనేతలు కూడా సమర్పణకు సిద్ధమయ్యారని గూఢచార సంస్థలు వెల్లడించాయి.ఈ పరిణామాలు మావోయిస్టు పార్టీ అంతర్గతంగా పెద్ద కలకలం రేపాయి.ప్రభుత్వం ఇప్పటికే లొంగిపోయే మావోయిస్టులకు పునరావాస పథకాలతో పాటు ఆర్థిక సాయం, భద్రతా హామీలు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. అంతేకాకుండా, మావోయిస్టుల లొంగుబాటును ప్రోత్సహించేందుకు పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు.విశ్లేషకుల ప్రకారం, మావోయిస్టు ఉద్యమం తన శక్తిని కోల్పోతూ శాంతి చర్చల దిశగా మళ్లడం సానుకూల పరిణామమని పేర్కొన్నారు. వరుస లొంగుబాట్లతో అడవుల్లోని మావోయిస్టు బేస్‌క్యాంపులు బలహీనమవుతున్నాయని, సమీప భవిష్యత్తులో మిగిలిన అగ్రనేతలు కూడా లొంగిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్టు ఉద్యమం గత మూడు దశాబ్దాలుగా చూడని అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆశన్న, మల్లోజుల వంటి అగ్రనేతల లొంగుబాటు మావోయిస్టు నిర్మూలన యత్నాలకు పెద్ద ఊతమని అధికార వర్గాలు వ్యాఖ్యానించాయి.శాంతి మార్గమే శాశ్వత మార్గం” అంటూ ప్రభుత్వ ప్రతినిధులు, పోలీస్‌ ఉన్నతాధికారులు పునరుద్ఘాటిస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :