ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : కార్పొరేట్ పాఠశాల నిబంధనలన్నీ వదిలేసి విద్యార్థుల భద్రతను పక్కన పెట్టి, వాణిజ్య ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్న కొన్ని కార్పొరేట్ పాఠశాలల తీరుతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి స్కూళ్లలో విద్యార్థుల జీవితం అశాంతిలో కూరుకుపోతోంది. నిబంధనలకు విరుద్ధంగా భవనాలు, తరగతి గదులు ఏర్పాటు చేయడం, భద్రతా ప్రమాణాల లేని స్థలాల్లో పిల్లలను ఉంచడం వంటివి ఈ తరహా పాఠశాలలలో రోజూవారీ జరిగే ఘటనలుగా మారాయి.ఇటీవలి ఘటనల్లో ఒక కార్పొరేట్ స్కూల్ భవనంపై నుండి విద్యార్థి ఒక్క అడుగు తప్పితే ప్రాణం పోయేది. అలాంటి ప్రమాదాలను నివారించాల్సిన బాధ్యత విద్యాసంస్థలదా? లేక విద్యాశాఖ అధికారులదా? అనే ప్రశ్నలు తల్లిదండ్రుల మదిలో తలెత్తుతున్నాయి. వాహనాల తనిఖీలు, టెస్టుల నిర్వహణలో మాత్రమే చురుకుగా కనిపించే పోలీస్ శాఖ అధికారులు ఇటువంటి పాఠశాలలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సప్తగిరి కాలనీలోని ఒక ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల యాజమాన్యం పిల్లల ప్రాణాలను బెట్టిపెట్టే భద్రతా ఉల్లంఘనలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులు మాత్రం మూగవైఖరి ఎంచుకోవడం పట్ల ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి.చిన్నచితకా స్కూళ్లపై మాత్రం సీరియస్ అయి చర్యలు తీసుకుంటూ, కార్పొరేట్ విద్యాసంస్థల దురాగతాలపై కనీస స్పందన చూపించకపోవడం పలు విమర్శలకు దారి తీస్తోంది.పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడే పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ తల్లిదండ్రుల నుంచి ఊపందుకుంటోంది. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో పిల్లల భవిష్యత్తు మాత్రమే కాదు, ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధులు మరిచి వాణిజ్యరంగ హస్తాన్ని గౌరవించే విద్యాశాఖ చర్యలు తీసుకోవాలంటే, ఏదైనా ఘటన జరిగాక స్పందించాల్సిన అవసరం ఉందా? అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతుంది. కార్పొరేట్ స్కూళ్ల పెత్తందారీ ధోరణి ఎంత వరకూ కొనసాగుతుందో? అనేది చూడాల్సిందే.
Admin
Aakanksha News