ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే సంతానానికి వారిచే ఇచ్చిన ఆస్తులపై హక్కు ఉండదని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తల్లిదండ్రులు నిరాదరణకు గురైతే, వారు బదిలీ చేసిన ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకునే పూర్తి హక్కు ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది.మహారాష్ట్రకు చెందిన 80 ఏళ్ల వృద్ధ దంపతులు చేసిన విజ్ఞప్తిపై ఈ తీర్పు వెలువడింది. తమ కుమారుడు పోషణ బాధ్యతలు నిర్వర్తించక పోవడంతో తాము అన్యాయానికి గురవుతున్నామని వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో విచారణ జరిపిన ధర్మాసనం ‘తల్లిదండ్రుల వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం–2007’ తల్లిదండ్రులకు రక్షణగా నిలుస్తుందని పేర్కొంది.వృద్ధులు లేదా తల్లిదండ్రులు పిల్లల నిర్లక్ష్యం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటే, ఆ చట్టం కింద ఏర్పాటైన ట్రైబ్యునళ్లు వేగంగా విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోర్టు ఆదేశించింది. పిల్లలకు అప్పగించిన ఆస్తి విషయంలో వారు తల్లిదండ్రులను పట్టించుకోని సందర్భంలో, ఆ యాజమాన్యాన్ని తిరిగి తల్లిదండ్రులకే అప్పగించే అధికారం ట్రైబ్యునళ్లకు ఉందని స్పష్టంచేసింది.ఇకపై వృద్ధాప్య తల్లి దండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి మీద హక్కు ఉండదన్న తీర్పు, సమాజంలో పిల్లలు పెద్దలను గౌరవించేలా మార్గనిర్దేశం చేస్తుందనే అభిప్రాయం న్యాయవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
Admin
Aakanksha News