ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత, నేతల పట్ల అనుచిత ప్రవర్తన కారణంగా సొంత నాయకులే పార్టీని వీడుతున్నారు. దీంతో పాలకుర్తి ప్రాంతంలో కాంగ్రెస్ బలహీనత రోజురోజుకు స్పష్టమవుతోంది.తాజాగా పాలకుర్తి నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తారహస్తం గులాబీ కండువా కప్పుకున్నారు. ఆమెతో పాటు పలు గ్రామాల స్థాయి కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలం నీర్మాల గ్రామానికి చెందిన సుమారు 120 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి, పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు సమక్షంలో వీరు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి వారిని కండువా కప్పి పార్టీ తరపున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి వంటి అంశాలపై దృష్టి పెట్టడం లేదు. రేవంత్ పాలనలో పార్టీ నాయకులకు గౌరవం లేకుండా పోయింది. అందుకే మేము బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నాం అని తెలిపారు. ఓయూ విద్యార్థి నాయకుడు పృథ్వీ రెడ్డి కూడా ఈ సందర్భంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. యువతకు అవకాశాలు ఇవ్వడంలో, అభివృద్ధి పథకాలను అమలు చేయడంలో బీఆర్ఎస్ పార్టీ ముందు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. స్థానిక కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీ రెడ్డి తీరుతో విసిగి, పార్టీని వదిలేశాం. ఆమె కారణంగా పార్టీ లోపల విభేదాలు, అసహనం పెరిగాయి. బీఆర్ఎస్లో అయితే ప్రజల కోసం పనిచేసే అవకాశం లభిస్తుందని భావించాం” అని పలువురు నాయకులు పేర్కొన్నారు.ఈ సందర్బంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ – “కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అంచనాలను తీర్చడంలో పూర్తిగా విఫలమైందని పాలకుర్తి ప్రజలు రేవంత్ పాలనను తిరస్కరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్పై ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ బలమైన ప్రత్యామ్నాయం అవుతుంది” అని వ్యాఖ్యానించారు.బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో జరిగిన అభివృద్ధి, పథకాల అమలు ఈ ప్రాంత ప్రజల మదిలో ఇంకా నిలిచే ఉన్నాయి. మళ్లీ ఆ బాటలోనే పయనించేందుకు కొత్త శక్తులు చేరుతున్నాయని అన్నారు.తాజా చేరికలతో పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలాన్ని మరింతగా పెంచుకుంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ శ్రేణులు మళ్లీ చురుకుదనం ప్రదర్శిస్తున్నాయి. స్థానిక స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తాత్కాలికంగా మోరల్ డౌన్ అయినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిన ఈ తరుణంలో కాంగ్రెస్ నేతల ఈ వలసలు రేవంత్రెడ్డి ప్రభుత్వానికి మరో ప్రతీకాత్మక దెబ్బగా భావిస్తున్నారు. రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నట్లు, రానున్న రోజుల్లో పాలకుర్తి సహా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇంకా పలువురు నేతలు గులాబీ కండువా కప్పే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఈ పరిణామాలతో పాలకుర్తి రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. బీఆర్ఎస్ బలంగా నిలబడగా, కాంగ్రెస్ తాత్కాలికంగా రక్షణాత్మక ధోరణిలోకి జారినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
Admin
Aakanksha News