Saturday, 27 June 2026 09:02:06 PM

ఓటర్ ఐడీని ఆధార్‌తో అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

Date : 19 March 2025 06:15 AM Views : 593

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : ఓటర్ ఐడీని ఆధార్‌తో అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆధార్‌తో ఓటర్ ఐడీ అనుసంధానం చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం వెల్లడించింది. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో ఎన్నికల సంఘం అధికారులు సమావేశమై.. సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనిపై సాంకేతిక నిపుణులతో సంప్రదింపులు చేపడతామని తెలిపింది. ఆర్టికల్ 326, ప్రజా ప్రతినిధులు చట్టం-1950,అలాగే సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులను అనుసరించి.. ఓటర్ గుర్తింపు కార్డులను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసేందుకు ఈసీ చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో యూఏడీఐ, ఈసీఐ మధ్య సాంకేతిక పరమైన అంశాలపై త్వరలో చర్చించనుంది. ఈ రోజు న్యూఢిల్లీలోని కేంద్రం ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో జరిగిన చర్చలో ఎన్నికల ప్రధాన కమిషనర్‌తోపాటు ఇద్దరు కమిషనర్లు, అలాగే కేంద్ర హోం శాఖ కార్యదర్శితోపాటు ఎలక్ట్రానిక్స్ శాఖ ముఖ్య కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.దేశంలో ప్రతి పౌరుడు తన ఆధార్ కార్డును ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలకు అనుసంధానం చేశాడు. అలాగే పాన్ కార్డుతో సైతం అనుసంధానం చేశారు. అయితే ఆధార్ కార్డును.. ఓటర్ గుర్తింపు కార్డుతో అనుసంధానం చేయాలంటూ గత కొంత కాలంగా డిమాండ్ వినిపిస్తోంది. ఆ క్రమంలో పలువురు కోర్టుల తలుపు సైతం తట్టారు. అలాంటి వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రజాస్వామిక వాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే..

భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామిక దేశం. ప్రతి ఏటా దేశంలో ఎక్కడో అక్కడ.. ఎప్పుడో అప్పుడు ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి వేళ.. కొందరి పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగిస్తున్నారు. అది కూడా వారి ప్రమేయం లేకుండానే. దీంతో ఈ అంశంపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక మిన్నకుండి పోతున్నారు. అలాంటి వారికి ఓటరు గుర్తింపు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల.. ఈ తరహా తప్పులు భవిష్యత్తులో పునరావృతం కావనే ఓ భావన సామాన్య మానవుడిలో ప్రారంభమైంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :