ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : కామారెడ్డి జిల్లాలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో రైలురోకో ఆందోళన శుక్రవారం ఉద్రిక్తంగా మారింది. కామారెడ్డి రైల్వే స్టేషన్ పరిధిలో రైలు పట్టాలపై బైఠాయించిన కవితతో పాటు జాగృతి నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వంపై నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.రైల్వే ట్రాఫిక్ను పూర్తిగా నిలిచిపోయేలా చేసిన ఈ నిరసనపై పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నించారు. ఆందోళన కొనసాగుతుండగా పలుమార్లు తరలివెళ్లాలని సూచించినప్పటికీ కవిత సహా నాయకులు పట్టాలు వీడకపోవడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. కవితతో పాటు పలువురు జాగృతి నేతలను అరెస్టు చేసిన సంఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైల్వే స్టేషన్ పరిసరాల్లో క్షణక్షణం ఉద్రిక్తత నెలకొనడంతో అదనపు పోలీసు బలగాలను మోహరించారు.బీసీ రిజర్వేషన్ల అమలు కోసం పోరాటం ముమ్మరం చేస్తామని, ప్రజల హక్కుల కోసం ఈ ఆందోళనలు కొనసాగుతాయని జాగృతి నాయకులు ప్రకటించారు.
Admin
Aakanksha News