Wednesday, 12 August 2026 05:47:52 PM

భారత్‌పై మరోసారి నోరు పారేసుకున్న కెనడా...

సా ర్వత్రిక ఎన్నికల్లో భారత్‌ జోక్యం చేసుకునే అవకాశం ఉందని ఆరోపణ

Date : 25 March 2025 05:52 PM Views : 774

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : భారత్‌పై కెనడా మరోసారి నోరు పారేసుకుంది. ఆ దేశంలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భారత్‌ జోక్యం చేసుకునే అవకాశం ఉందని ఆ దేశ స్పై ఏజెన్సీ ఆరోపించింది. భారత్‌తోపాటు చైనా, రష్యా, పాకిస్థాన్‌ దేశాలు కూడా ఆ ప్రయత్నం చేయొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేసింది. కెనడియన్‌ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ డిప్యూటీ డైరెక్టర్‌ వానెస్సా లాయిడ్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.‘త్వరలో మా దేశంలో జరగబోయే ప్రజాస్వామ్య ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు పీఆర్‌సీ (పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా) ఏఐ ఆధారిత సాధనాలను ఉపయోగించే అవకాశం ఉందని మాకు సమాచారం ఉంది. ఈ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునే ఉద్దేశం, సామర్థ్యం భారత ప్రభుత్వానికి కూడా ఉందని మేం భావిస్తున్నాం. రష్యా, పాకిస్థాన్‌ దేశాల కూడా ఆ ప్రయత్నాలు చేయొచ్చు’ అని లాయిడ్‌ ఆరోపించారు.కాగా.. గతంలో కెనడా ఇలాంటి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 2019, 2021లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో భార‌త్‌, పాకిస్థాన్ దేశాలు జోక్యం చేసుకున్నట్లు కెన‌డా సెక్యూటీ ఇంటెలిజెన్స్ స‌ర్వీస్ ఆరోప‌ణ చేసింది. ఈ ఆరోపణలపై ఆ దేశం దర్యాప్తునకు ఆదేశించింది. ఈ దర్యాప్తులో భారత్‌ జోక్యం చేసుకోలేదని తేలింది. కెన‌డా ఎన్నిక‌ల్లో భార‌త్ జోక్యం చేసుకోలేద‌ని, ప్రధాని జ‌స్టిస్ ట్రూడో విజ‌యంలో ఆ దేశ పాత్ర ఏమీ లేద‌ని కెన‌డా విచార‌ణాధికారులు వెల్లడించారు.2021లో జ‌రిగిన జాతీయ ఎన్నిక‌ల్లో భార‌త్ జోక్యం చేసుకోలేద‌ని గుర్తించామ‌ని కెన‌డా సీనియ‌ర్ అధికారుల బృందం పేర్కొన్నది. అయితే గ‌త రెండు ఎన్నిక‌ల్లో చైనా జోక్యం చేసుకున్నట్లు గుర్తించామ‌ని కెన‌డా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తెలిపింది. మరోవైపు కెన‌డా ఎన్నిక‌ల్లో జోక్యం చేసుకున్నట్లు గ‌తంలో వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను ఇండియా అప్పట్లోనే కొట్టిపారేసింది. ఇత‌ర ప్రజాస్వామ్య దేశాల వ్యవ‌హారంలో జోక్యం చేసుకోబోమ‌ని భార‌త విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇప్పుడు మరోసారి భారత్‌పై ఒట్టావా అలాంటి ఆరోపణలే చేయడం గమనార్హం.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :