ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : మంచిర్యాల జిల్లా కేంద్రంలో మద్యం మత్తులో ఓ పోలీస్ కానిస్టేబుల్ సృష్టించిన హంగామా స్థానికంగా కలకలం రేపింది. అర్ధనగ్నంగా ఇంటి ఎదుట నానా హంగామా చేయడమే కాకుండా నడిరోడ్డుపై భార్యా, బిడ్డలను కిరాతకంగా దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారి సంచలనం సృష్టిస్తున్నాయి.స్థానికుల వివరాల ప్రకారం, రవి ప్రసాద్ అనే వ్యక్తి మంచిర్యాల పోలీస్ స్టేషన్లో రైటర్గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మద్యం మత్తులో ఉన్న ఆయన ఇంటి ఎదుట అర్ధనగ్న స్థితిలో తీవ్రంగా అల్లరి చేశాడు. ఆ సమయంలో భార్యా, చిన్నారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్లు సమాచారం. కాళ్లు, చేతులు పట్టుకుని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కనికరించకుండా కొట్టినట్లు, చివరకు వారిని ఇంటి నుంచి గెంటేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనను చూసిన చుట్టుపక్కల వారు సెల్ఫోన్లలో వీడియోలు చిత్రీకరించారు. అవి సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందడంతో పోలీస్ శాఖపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విధుల్లో ఉండాల్సిన పోలీస్ ఉద్యోగి ఇలా ప్రజా ప్రదేశంలో అనుచితంగా ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆశ్చర్యకరంగా ఈ స్థాయిలో హంగామా చేసిన కానిస్టేబుల్ నేడు ఎలాంటి అడ్డంకులు లేకుండా విధులకు హాజరైనట్లు తెలిసింది. దీనిపై స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. బాధితురాలైన భార్య కూడా పోలీస్ శాఖలోనే ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వీడియో ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలతో విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. విధి నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు పేర్కొన్నారు.
Admin
Aakanksha News