ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి రైల్వే టెర్మినల్ వరకు ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు నడుపుతున్నట్టు ఆర్టీసీ చెంగిచెర్ల డిపో మేనేజర్ కే. కవిత తెలిపారు. నూతనంగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభమైనందున రైల్వే ప్రయాణికులకు రవాణా సౌకర్యం కల్పించేందుకు 10 నిమిషాలకో బస్సు నడుపుతున్నామన్నారు. రూట్ నెంబర్ 250సీ సికింద్రాబాద్ బ్లూసీ పాయింట్ నుంచి ఉదయం 4.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు వయా హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, హెచ్ పీసీఎల్ మీదుగా ప్లాట్ ఫాం నెంబర్ 1 చర్లపల్లి రైల్వే టెర్మినల్కు, అక్కడి నుంచి సికింద్రాబాద్కు బస్సు సౌకర్యం ఉందని చెప్పారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి చెంగిచెర్ల, ఉప్పల్, రామంతాపూర్ మీదుగా బోరబండకు ప్రతి రోజు 40 నిమిషాలకు ఒక్క బస్సు కొత్తగా ప్రారంభించినట్టు చెప్పారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా అదనంగా నడిపే ప్రత్యేక రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల కోసం ప్రతి రోజు ఉదయం, సాయంత్రం, రాత్రి వేళలో ఉప్పల్ నుంచి ప్లాట్ ఫాం నెంబర్-9 చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు అదనంగా బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని ఆమె కోరారు.
Admin
Aakanksha News