ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : పండుగల విషయంలో గందరగోళ పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని సంప్రదాయ సిద్ధాంతాలను పాటిస్తూ సమాజానికి, ప్రభుత్వానికి మేలు జరిగేలా సమిష్టి నిర్ణయం తీసుకున్నట్లు ఉభయ వేదాంతాచార్య పీఠ ఆస్థాన సిద్ధాంతులు ఉ.వే.తి.న.చ సంపత్ కుమార కృష్ణమాచార్య సిద్ధాంతి, శ్రీవైష్ణవ ఆగమ సంప్రదాయ సేవా సమితి(శ్వాస్) అధ్యక్షుడు మంగళగిరి యాదగిరి స్వామి తెలిపారు. సనాతన శాస్త్ర ప్రమాణాల ఆధారంగా విశ్వావసు సంవత్సర(2025-26)లో జరుగబోయే సాధారణ పండుగలు, విశేష పర్వదినాల తేదీలను నిర్ణయించి నట్లు వారు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇటీవల శంషాబాద్ లోని ముచ్చింతల్లో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి సమక్షంలో విశ్వావసు పంచాగ సిద్ధాంత నిర్ణాయక సభ జరిగిందని, ఈ సభకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని దివ్య క్షేత్రాల ఆస్థాన సిద్ధాంతులు, వివిధ పీఠాల ఆస్థాన సిద్ధాంతులు, ఇతర ప్రముఖ సిద్ధాంతులు 76 మంది హాజరై సమాజ శ్రేయస్సు, సనాతన ధర్మ వ్యాప్తిపై విపులంగా చర్చించినట్లు చెప్పారు. పండుగల విషయంలో గందరగోళ పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని సంప్రదాయ సిద్ధాంతాలను పాటిస్తూ సమాజానికి, ప్రభుత్వానికి మేలు జరిగేలా సమిష్టి నిర్ణయం తీసుకున్నట్లు తెలుగు రాష్ట్రాల సీఎంలను కలిసి తాము తీసుకున్న నిర్ణయాలు తెలిపి ఆమోద పత్రాలను అందజేస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రతినిధులు వెంకట కిషోర్, సౌమిత్రి శ్రీధర్ స్వామి, వరద స్వామి, వేణుస్వామి, ఆచార్య ఆత్రేయ, గోవర్ధనం, వెంకట రమణాచార్య పాల్గొన్నారు.
Admin
Aakanksha News