ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం నియోజక వర్గంలో గ్రహాంతరవాసి తిరుగుతున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆదివారం గోదావరిఖని చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రామగుండంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గుండాగిరి, దౌర్జన్యాలు ప్రజలు ఎప్పుడు ఆదరించారని పేర్కొన్నారు. లక్ష్మీపురంలో జరిగిన దానికి సంబంధించి నాకు ఎటువంటి సంబంధం లేకున్నా నాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని దీనిపై ఎలక్షన్ కమిషన్ తో పాటు పోలీసులకు పిర్యాదు చేస్తామని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రామగుండంలో బీఆర్ఎస్ పార్టీ బలమైన శక్తిగా ఉందని 50 వేల మంది ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. అలాగే నియోజక వర్గానికి మెడికల్ కళాశాలతో పాటు సబ్ రిజిస్టర్ కార్యాలయం, పోలీస్ కమిషనరేట్, జిల్లా కోర్టును కేసీఆర్ మంజూరు చేసారని అన్నారు. ఇప్పటికే 400 కోట్లతో అభివృద్ధి పనులు నిర్వహించమన్నారు. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను 3వ సారి ముఖ్యమంత్రి చేయాలని రామగుండంలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Admin
Aakanksha News