Saturday, 18 April 2026 09:00:30 AM

కేసీఆర్ అబద్దాల కోరు, మోదీ మోసగాడు

ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ఆధీనంలో కీలక శాఖలు...కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి.... పెద్దపల్లి కాంగ్రెస్ సభలో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ

Date : 19 October 2023 06:46 PM Views : 384

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : పెద్దపల్లి కాంగ్రెస్ సభలో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అబద్దాల కోరు, మోదీ మోసగాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు."ఇప్పుడు దొరల తెలంగాణ -ప్రజల తెలంగాణ మధ్య యుద్ధం జరుగుతోంది. కీలక శాఖలన్నీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగింది. ఇక్కడి భూములు ముంచి, ఇక్కడి భూములను లాక్కున్నారు. అయినా ఇక్కడి ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు. ముఖ్యమంత్రికి, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రమే లాభం కలిగింది. ధరణి పోర్టల్ తో పేదల భూములను సీఎం లాకున్నారు. ధరణి పేరుతో భూముల రికార్డులు మార్చేసి ప్రజలను మోసం చేస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, రుణ మాఫీ అమలు కాలేదు. పెద్ద పెద్ద రైతులకే రైతు బంధు లాభం జరిగింది. తెలంగాణకు వస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు తెలంగాణతో ఉన్న సంబంధం... రాజకీయ సంబంధం కాదు. కుటుంబంతో ఉన్న అనుబంధం నాది. 2004లోనే తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా ప్రకటన చేసింది. ఆ తర్వాత రాష్ట్ర ఏర్పాటుకు సోనియా నిర్ణయం తీసుకున్నారు. సింగరేణి గనులను ప్రైవేటు పరం కానివ్వం. ఇక్కడి గనులను అదానికి అమ్మే ప్రయత్నాన్ని మేమే అడ్డుకున్నాం.దేశవ్యాప్తంగా అన్ని వనరులను అదానికే మోడీ అప్పగిస్తున్నారు. కార్మికులు, రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. దళితులకు మూడేకరాలని కేసీఆర్, 15 లక్షలు ఖాతాల్లో వేస్తామని మోదీ మోసం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పదు. కర్ణాటక, ఛత్తీస్‌గడ్‌లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. కర్ణాటకలో మీరు ఎవరినైనా అడిగి తెలుసు కోండి." అని రాహుల్ గాంధీ అన్నారు."తెలంగాణలోనూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం. 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తాం. ఎన్నికల తర్వాత మొదటి కేబినెట్ మీటింగ్ లోనే వీటిని అమలు చేస్తాం. అధికారం‌లోకి వచ్చిన మొదటి రోజే అమలు చేస్తాం. కేసీఆర్ ఇక మీ ప్రభుత్వం ఉండదు. ప్రజల ప్రభుత్వం రాబోతోంది. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే. ఈ మూడు పార్టీలు కలిసి పని చేస్తున్నాయి. బీజేపీకి ఓటు వేసినా, ఎంఐఎంకు వేసినా బీఆర్ఎస్ కు వేసినట్టే. నేను బీజేపీపై పోరాటం చేస్తున్నాను. నాపై 26 కేసులు పెట్టారు. లోక్‌సభ సభ్యత్వం రద్దు చేశారు. ఢిల్లీలో ఇంటిని లాక్కున్నారు. సభలో మాట్లాడితే మైక్ కట్ చేస్తున్నారు. అవినీతి కేసీఆర్‌పై మాత్రం ఎలాంటి కేసులు ఉండవు. అన్ని విషయాల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దత్తు ఇచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్‌ను, ఢిల్లీలో బీజేపీని ఓడించాలి. కాంగ్రెస్ తుఫాన్ రాబోతుంది. కాంగ్రెస్ కార్యకర్తలే మా పులులు. ఎవరికి భయపడొద్దు, రాబోయేది తెలంగాణ ప్రజల ప్రభుత్వం. కాంగ్రెస్ సర్కారులో కార్యకర్తల భాగస్వామ్యం ఉంటుంది."అని రాహుల్ గాంధీ అన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :