ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల సైరన్ మోగింది. వాయిదా వేయడానికి యాజమాన్యం చేసిన ప్రయత్నాలు విఫలం చేస్తూ హైకోర్టు తీర్పునివ్వడంతో కేంద్ర కార్మిక శాఖకు చెందిన డిప్యూటీ సీఎల్ సీ ముందుగా అనుకున్న ప్రకారం అక్టోబర్ 28న గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఆదేశిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అయితే ఈ సమావేశానికి రెండు కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, బీఎంఎస్ లు మాత్రమే హాజరయ్యాయి. యాజమాన్యంతో పాటు గుర్తింపు సంఘం హోదాలో ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఎస్, ఐ ఎన్టీయూసీ, హెచ్ ఎంఎస్, సీఐటీయూ,ఐ ఎఫ్ టీయూ కార్మిక సంఘాలు సమావేశానికి గైహాజరయ్యాయి. హైకోర్టు తీర్పు మేరకు అక్టోబర్ లోపు ఎన్నికలు నిర్వహించాలని డిప్యూటీ సీఎల్ సీ సింగరేణి ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. అయితే సాధారణ ఎన్నికలు పూర్తయ్యే వరకు సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని డిప్యూటీ సీఎల్ సీకి 13 కార్మిక సంఘాలు వేరువేరుగా లేఖలు రాశాయి. సింగరేణి యాజమాన్యం సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సింగరేణి వ్యాప్తంగా ఇప్పటికిప్పుడు కార్మిక సంఘం ఎన్నికలు జరిగితే సింగరేణి విస్తరించి ఉన్న 11 అసెంబ్లీ స్థానాలు ఆరు పార్లమెంటు స్థానాల్లో అధికార పార్టీపై ప్రభావం చూపించే అవకాశం ఉండడంతో అధిష్టానం సైతం సింగరేణి ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సింగరేణి ఎన్నికల బాధ్యతను మొత్తం స్థానిక ఎమ్మెల్యేలకే అప్పగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రతి డివిజన్ లో సింగరేణి వ్యాప్తంగా ఎవరికివారు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గెలుపు లక్ష్యంగా కృషి చేయాలని ఏదైనా డివిజన్ లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఓటమి పాలైతే దాని పూర్తి బాధ్యత స్థానిక ఎమ్మెల్యేదే అని వారికి టికెట్ కూడా కట్ చేస్తామని అధిష్టానం నుంచి స్థానిక ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏది ఏమైనా సింగరేణి ఎన్నికల బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించడంతో వారికి తలనొప్పిగా మారిందని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఏదేమైనా సింగరేణిలో ఎన్నికలు ఏ విధంగా ఉంటాయో కార్మికులు ఎవరికి పెట్టను కడతారో వేచి చూడాల్సిందే.
Admin
Aakanksha News