ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా అంశాల్లో స్పష్టత లేదని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సునీత లక్ష్మా రెడ్డి విమర్శించారు. ఈ మేరకు తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ... సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిస్తే కొందరు కావాలనే పార్టీ మారుతున్నామంటూ మాపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.మెదక్ పార్లమెంట్ సమీక్ష ముగిశాక ప్రభుత్వ విధానాల మీద ప్రశ్నించామని, మహాలక్ష్మి ,యువ వికాసం గ్యారంటీలు ఎప్పటి నుండి అమలు చేస్తున్నారో చెప్పాలని అన్నారు. నా నియోజక వర్గంలో ప్రొటో కాల్ వివాదాల అంశం పై ఐజీ శివధర్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డిని కలిసామని పేర్కొన్నారు. మేము పార్టీ మారే ప్రసక్తి లేదని, కొందరు ప్రజలలో గందర గోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అంతే కాకుండా అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.మా అధిష్టానానికి మా మీద సంపూర్ణ విశ్వాసం ఉందని, కేసీఆర్ వెంటే ఉంటాం అని స్పష్టం చేసారు. మెదక్ గులాబీ జెండాకు పుట్టినిల్లు అని కేసీఆర్ సారధ్యంలో మెదక్ పార్లమెంటు నియోజక వర్గాన్ని గెలుచుకుంటాం అని ధీమా వ్యక్తం చేశారు. మా మీద దుష్ప్రచారం కొనసాగిస్తే పరువు నష్టం దావాలకు వెనుకాడం అని హెచ్చరించారు.
Admin
Aakanksha News