ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ వల్ల, రాష్ట్ర ప్రభుత్వం చేసే కాంట్రాక్టీకరణతో భవిష్యత్తులో సింగరేణి ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని, సింగరేణిలో ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణకు వ్యతిరేకంగా ఏఐటీయూసీ ఇచ్చే పోరాటాలకు కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని,సింగరేణి సంస్థను కాపాడుకోవాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. సింగరేణి ఆర్జీ- 1 ఏరియాలోని జిడికే 2వ ఇంక్లైన్ లో జరిగిన గేట్ మీటింగ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సింగరేణికి చెందాల్సిన బొగ్గు గనులను కమర్షియల్ మైనింగ్ చట్టం పేరుతో బడా పారిశ్రామిక వేత్తలకు దారాదత్తం చేస్తూ బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేస్తుందని, దీని వల్ల భవిష్యత్తులో సింగరేణి ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం గనుల్లో పర్మినెంట్ కార్మికుల స్థానంలో కాంట్రాక్టు కార్మికులను విచ్చలవిడిగా నియమిస్తూ కాంట్రాక్టీకరణను పెంచి పోషిస్తుందని ఆయన ఆరోపించారు.మరో వైపు కొత్త ఓపన్ కాస్టుల్లో మట్టి తొలిగింపుతో పాటు బొగ్గు త్రవ్వకాలను కూడా బడా కాంట్రాక్టర్లకు అప్పగిస్తూందని, పర్మనెంటు కార్మికులు లేకుండా చేస్తుందని విమర్శించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాల వల్ల సింగరేణిలో శాశ్వత కార్మికుల సంఖ్య తగ్గుతుందని,నూతన గనులు రావడం లేదని,ఉన్న గనులను ఓసిపిలుగా మారుస్తూ పర్మనెంటు కార్మికుల సంఖ్య తగ్గిస్తూ కాంట్రాక్టు కార్మికుల సంఖ్యను విపరీతంగా పెంచుతున్నారని ఆయన విమర్శించారు. సింగరేణిలో కార్మికులు కష్టపడి బొగ్గు ఉత్పత్తిని సాధించి కోట్లాది రూపాయలు లాభాలు తీసుకువస్తే వాటిని కార్మికుల సంక్షేమానికి,సంస్థ అవసరాలకు ఉపయోగించకుండా, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు దారాదత్తం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బకాయి పడ్డ దాదాపు 24వేల కోట్ల రూపాయలు సంస్థకు చెందిన బొగ్గు,విద్యుత్ ను వాడుకొని ఇంత వరకు చెల్లించలేదని ఆయన విమర్శించారు. సింగరేణి ఆర్జీ- 1 లో కార్మికుల కు న్యాయంగా రావాల్సిన ప్రమోషన్ లు,ఇంక్రిమెంట్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణిలో 2012 తర్వాత గుర్తింపు సంఘం టిబిజికెఎస్ వల్లనే గనులు, ఓపెన్ కాస్ట్ లలో కాంట్రాక్టీరణ పెరిగిందని ఆయన ఆరోపించారు. గుర్తింపు సంఘం టిబిజికెఎస్ యూనియన్ కార్మికుల సమస్యలను పరిష్కరించడం లో విఫలం చెందిందని, నాయకులు ప్రతి పనికి ఒక రేట్ ఫిక్స్ చేసి అధికారులతో కుమ్మక్కై కార్మికులను ఆర్థిక దోపిడి చేస్తున్నారని ఆయన విమర్శించారు.సింగరేణిలో గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసినందున వెంటనే హైకోర్టు తీర్పు ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ఆయన యాజమాన్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి, కార్మికుల సంక్షేమం కోసం, వారి హక్కుల కోసం నిరంతరం పోరాటాలు చేస్తున్న ఏఐటీయూసీని ఆదరించాలని ఆయన కార్మికులకు కోరారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆర్జీ- 1 బ్రాంచి కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐటియుసి కేంద్ర నాయకులు వేల్పుల నారాయణ,రంగు శ్రీనివాస్, ఎస్.వెంకట్ రెడ్డి, చెప్యాల మహేందర్ రావు, పర్లపెల్లి రామస్వామి, జి.ప్రభుదాస్, ఆర్.వెంకట స్వామి, పొన్నాల వెంకటయ్య, ఎల్.రమేష్, ఎం.యాదయ్య, ఎస్.జోసెఫ్, పి.సదయ్య, వేణుగోపాల్ రెడ్డి, గంగారపు చెంద్రయ్య, సల్ల రవిందర్, రాజేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News