ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీ వారికి విభేదాలు మరోసారి తెరమీదకెక్కాయి. ఈనెల 8వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఓవైపు ప్రతిపక్షాలు అడ్డుకుంటామని ప్రకటనలు విడుదల చేస్తున్న క్రమంలో అధికార పార్టీలో మాత్రం వేరువేరు సమావేశాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో 8వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు గోదావరిఖని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ తో పాటు హోం మంత్రి మొహమ్మద్ అలీ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరవుతారని పేర్కొన్నారు. రామగుండం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభించడంతో పాటు బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభ కార్యక్రమం కోసం కమిటీలను ఏర్పాటు చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అయితే దీని భిన్నంగా రామగుండం ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న ఆశవాహులు ప్రత్యేక సమావేశమై కేటీఆర్ పర్యటనపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రామగుండం నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయడంతో పాటు అధిక సంఖ్యలో జనాలను తరలించేందుకు ఏర్పాట్లను చేయాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు వేరువేరుగా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలు పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలకు అద్దం పడుతున్నాయి. ఆశావాహులు ఏర్పాటు చేసిన సమావేశంపై సర్వత్ర చర్చ కొనసాగుతుంది.
Admin
Aakanksha News