ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజక వర్గంలోని కేశంపేట మండలంలో ఆన్ లైన్ గేమ్స్కు బానిసైన యువకుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. బిహార్ రాష్ట్రానికి చెందిన గుడ్డు కుమార్ యాదవ్ (20) కొంతకాలంగా కేశంపేట ప్రాంతంలో నివసిస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో ఆన్ లైన్ గేమ్స్కు అలవాటు పడి, వాటిలో భారీగా డబ్బులు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ నెల 6వ తేదీన గుడ్డు కుమార్ యాదవ్ ఇంటి నుంచి బయటకు వెళ్లిన తరువాత అదృశ్యమయ్యాడు. అతని కోసం కుటుంబ సభ్యులు, స్నేహితులు వెతకగా ఆచూకీ లభించలేదు. అనంతరం చౌలపల్లి రహదారి సమీపంలో చెట్టుకు ఉరేసుకున్న స్థితిలో అతని మృతదేహం గుర్తించడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఆన్లైన్ గేమ్స్ వల్ల ఏర్పడిన ఆర్థిక నష్టాలు, మానసిక ఒత్తిడి కారణంగానే యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో ఆన్లైన్ గేమ్స్ ప్రభావంపై మరోసారి చర్చ మొదలైంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Admin
Aakanksha News