ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో పెషేంట్ కేర్ లో పని చేస్తున్న రాజేష్ అనే వ్యక్తికి సంబందించిన మొబైల్ ఫోన్ చోరికి పాల్పడిన వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...ఆసుపత్రి ప్రాంగణంలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డులు పహారా కాస్తుండగా, అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని గమనించారు. ఆ వ్యక్తి ఆసుపత్రి సిబ్బంది వాహనాలు నిలిపిన ప్రదేశం వద్ద తిరుగుతూ, దిచక్ర వాహనాలపై కదలికలు చేస్తుండటాన్ని గుర్తించిన గార్డులు అప్రమత్తమయ్యారు.ఓ ద్విచక్ర వాహనాన్ని చోరీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని దేహశుద్ధి చేశారు. అయితే అంతకు ముందే ఆ వ్యక్తి ఒక దిచక్ర వాహనాన్ని తీసుకెళ్లి సమీపంలోని పెట్రోల్ బంకులో నిలిపి తిరిగి వచ్చి రెండో వాహనాన్ని కూడా దొంగిలించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో గార్డులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ చోరీకి పాల్పడిన వ్యక్తి జీఎం కాలనికి చెందిన రాసపల్లి మదన్ కుమార్ గా తెలుస్తుంది. వెంటనే సెక్యూరిటీ గార్డులు అతనిని అదుపులోకి తీసుకుని, ప్రశ్నించగా తడబడి సమాధానమిచ్చాడు. వెంటనే ఆసుపత్రి సిబ్బంది అక్కడికొచ్చి ఆ వ్యక్తికి ‘దేహశుద్ధి’ చేసి, పోలీసులకు సమాచారం అందజేశారు. తదనంతరం గోదావరిఖని 1 టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.అయితే అతను ఉదయం ఆసుపత్రిలో మొబైల్ ఫోన్ చోరీకి పాల్పడిన వ్యక్తి ఇద్దరు కలిసి వచ్చినట్టు, ఇద్దరు స్నేహితులు అయినట్లు తెలుస్తోంది.ఈ దొంగను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఆస్పత్రి సెక్యూరిటీ గార్డులు మల్లేష్, సాయి,రాజేంద్రప్రసాద్ లను పలువురు అభినందించారు.
Admin
Aakanksha News