Friday, 05 December 2025 04:12:56 AM

రైతు బీమా మంజూరుకు రూ.10 వేల లంచం....

– ఏసీబీ వలలో వ్యవసాయ అధికారి

Date : 06 November 2025 02:40 PM Views : 205

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : ప్రజా సేవకుడిగా ఉండాల్సిన అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడిన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. మరిపెడ మండల వ్యవసాయ విభాగంలో పనిచేస్తున్న ఏఈఓ (అసిస్టెంట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్) గాడిపెల్లి సందీప్ అనే అధికారి, చనిపోయిన రైతు బీమా మంజూరుకు రూ.10 వేల రూపాయల లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారుల చేతికి చిక్కాడు.వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వెల్లడించిన వివరాల ప్రకారం.. మరిపెడ మండలంలోని అనేపురం గ్రామానికి చెందిన రైతు బిక్కు అక్టోబర్ 14న మరణించాడు. రైతు బీమా పథకంలో నామినీగా ఉన్న రైతు కుమారుడు, బీమా పొందేందుకు గత నెల 30న మరిపెడ వ్యవసాయ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాడు. అయితే దరఖాస్తు పరిశీలన కోసం వచ్చినప్పుడు ఏఈఓ గాడిపెళ్లి సందీప్ “రూ.20 వేలు ఇస్తేనే పత్రాలు ఆన్లైన్ చేస్తాను” అంటూ లంచం కోరినట్లు తెలిసింది.దీనితో అవినీతిని సహించలేని బాధితుడు నేరుగా వరంగల్ ఏసీబీ కార్యాలయాన్ని సంప్రదించి ఫిర్యాదు చేశాడు. ఏసీబీ అధికారులు ముందస్తుగా ఉచ్చుపన్ను వేసి గురువారం మరిపెడలోని జేజే బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా లంచం తీసుకుంటున్న సందీప్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దరఖాస్తుదారుడి వద్ద నుండి రూ.10 వేల లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.డీఎస్పీ సాంబయ్య మాట్లాడుతూ...అధికారిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి రేపు (శుక్రవారం) ఉదయం వరంగల్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు పంపుతామని తెలిపారు. ఈ దాడిలో ఇన్స్పెక్టర్లు ఎల్. రాజు, శేఖర్, ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.తద్వారా ఏసీబీ అధికారులు నిందితుడి నివాసం, బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన ఏఈఓ ఘటనతో మరిపెడ మండలంలోని వ్యవసాయ శాఖలో చలనం నెలకొంది. రైతు సంక్షేమానికి అంకితభావంతో పనిచేయాల్సిన అధికారులు ఇలా లంచం తీసుకోవడం రైతు సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని రేపుతోంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :