Thursday, 25 June 2026 07:04:37 PM

హత్యాయత్నం కేసులో నలుగురు నిందితుల అరెస్టు...

Date : 01 October 2025 07:09 PM Views : 904

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రాంనగర్‌లో ఈ ఏడాది జనవరి 7న చోటుచేసుకున్న హత్యాయత్నం కేసును వన్‌టౌన్ పోలీసులు ఛేదించారు. కోదండరామాలయ సమీపంలోని సింగరేణి క్వార్టర్‌లో ఆర్ఎఫ్సీఎల్ అవుట్‌సోర్సింగ్ ఫిజీషియన్ అసిస్టెంట్ యశ్వంత్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. యశ్వంత్ భార్య ప్రతిమ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఏసీపీ రమేష్ పర్యవేక్షణలో విచారణ చేపట్టారు. ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రధాన నిందితుడు కన్నం ఛత్రపతిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. దర్యాప్తులో అతను నేరాన్ని ఒప్పుకోవడంతో పాటు మిగతా నిందితుల వివరాలు బయటపడ్డాయి. నిందితులు కన్నం ఛత్రపతి, నల్లగుల ప్రసాద్ అలియాస్ సన్నీ, అనవేని సాయి తేజ అలియాస్ బచ్చలి చింటూ, కన్నం సంధ్యలుగా పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుండి కత్తి, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం, నిందితుడు ఛత్రపతి తల్లి సంధ్య సింగరేణి హాస్పిటల్‌లో కాంట్రాక్టు నర్స్‌గా పనిచేస్తోంది. హాస్పిటల్‌లో ఉన్న కొందరు సహోద్యోగులతో జరిగిన విభేదాల కారణంగా యశ్వంత్ ఆమెపై అసభ్య పదజాలం ఉపయోగించాడని, అక్రమ సంబంధాల ఆరోపణలు చేశాడని తెలుస్తోంది. తల్లి గౌరవం దెబ్బతిన్నదని భావించిన ఛత్రపతి కోపంతో తన స్నేహితులను తోడుగా చేసుకొని హత్యాయత్నానికి పాల్పడ్డాడు. జనవరి 7న ఉదయం 11 గంటల నుంచి 12.30 గంటల మధ్య నిందితులు యశ్వంత్ ఇంటి వెనుక గోడ దూకి లోనికి ప్రవేశించి అతనిపై దాడి చేశారు. అనంతరం నిందితులు అక్కడి నుండి పారిపోయారు.పోలీసులు చాక చక్యంగా నిందితులను పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సంధ్యను అదుపులోకి తీసుకోవడానికి ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :